Gujarat reports first fatality due to chadipura virus: గుజరాత్ రాష్ట్రంలో చాందీపుర వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకి నాలుగేళ్ల బాలిక మృతిచెందింది. బాలికకు చాందీపుర వైరస్ సోకినట్లు పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ధృవీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో చాందీపుర వైరస్ అనుమానిత ఇన్ఫెక్షన్ కేసులు 14 నమోదయ్యాయి. కాగా, వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, బాలిక మృతిని మాత్రం వైరస్ కారణంగా అధికారులు ధృవీకరించారు. వారందరి శాంపిల్స్ ను ధృవీకరణ కోసం ఎన్ఐవీకి పంపినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి రిషికేశ్ పటేల్ తెలిపారు.
‘రాష్ట్రంలోని సబర్ కాంత జిల్లాలోని హిమత్ నగర్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన బాలిక స్వస్థలం ఆరావళిలోని మూటా కంఠారియా గ్రామం. ఆ బాలిక శరీరంలో చాందీపుర వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ వైరస్ మూలంగా గుజరాత్ రాష్ట్రంలో నమోదైన తొలి మరణం ఇదే’ అని జిల్లా ముఖ్య ఆరోగ్య అధికారి రాజ్ సుతారియా పేర్కొన్నారు. జిల్లా నుంచి పంపిన మూడు శాంపిల్స్ నెగెటివ్ గా తేలిందన్నారు. వారిలో ఒక రోగి మృతిచెందారని, మరో ఇద్దరు కోలుకున్నారని చెప్పారు.
Also Read: కొత్త స్కీమ్ను తీసుకొచ్చిన ప్రభుత్వం.. డిగ్రీ పూర్తయితే నెలకు రూ. 10 వేలు
ఈ అనుమానిత వైరస్ కేసులు ఆరావళి, మహిసాగర్, ఖేడా, సబర్ కాంత, మెహసనా, రాజ్ కోఠ్ జిల్లాల్లో నమోదైనట్లు మంత్రి రిషికేశ్ చెప్పారు. ఇద్దరు రాజస్థాన్ నుంచి, మరొకరు మధ్యప్రదేశ్ కు చెందినవారికి సోకగా, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందించినట్లు మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 26 రెసిడెన్షియల్ జోన్ లలో 44 వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసినట్లు ఆయన వివరించారు.
ఇదిలా ఉంటే.. ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపించనున్నాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులోవైరస్ జాతికి చెందినదంటూ వైద్యులు పేర్కొంటున్నారు.