Chandigarh Mayoral Polls: చండీగఢ్ మేయర్ ఎన్నికలో చెల్లని, వివాదానికి దారితీసిన ఎనిమిది బ్యాలెట్లు సహా రీకౌంటింగ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎనిమిది “చెల్లని” ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించి, చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలు రీకౌంటింగ్ ఆధారంగా ప్రకటించాలని ఆదేశించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికను నిర్వహించిన రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్లను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
“పోల్లోని ఓట్లను తిరిగి లెక్కించాలని మేము నిర్దేశిస్తున్నాము. ఈ 8 చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించాలి. రీకౌంటింగ్ ఆధారంగా ఫలితాలు ప్రకటించాలి” అని సుప్రీం కోర్టు పేర్కొంది, చెల్లని ఎనిమిది బ్యాలెట్లన్నీ ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు అనుకూలంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు అనుకూలంగా వచ్చిన మొత్తం ఎనిమిది బ్యాలెట్లపై అనిల్ మసీహ్ సింగిల్ లైన్ పెట్టారని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.
అనిల్ మసీహ్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, రిటర్నింగ్ అధికారి వేసిన గుర్తులు చిన్న చుక్కలని, బయట గందరగోళం ఉండటంతో అతను కెమెరాలను చూశాడని తెలిపారు. కెమరాలు ఉన్నాక ఎవరూ అలాంటి తప్పు చేయరని పేర్కొన్నారు.
Read More: మమతా సర్కార్ కు ఎదురుదెబ్బ.. సందేశ్ఖాలీ పర్యటనకు సువేందుకు పర్మిషన్..
రిటర్నింగ్ అధికారిగా ఉన్న అనిల్ మసీహ్ సంతకం చేయడానికి అర్హులని ఆయన అన్నారు.
రీకౌంటింగ్ తర్వాత ఏమి జరుగుతుంది?
జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో కాంగ్రెస్-ఆప్ కూటమికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించింది. బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ కు 16 ఓట్లు రాగా.. తన ప్రత్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. ఎనిమిది ఓట్లు చెల్లవని ప్రకటించారు. దీంతో ఆప్కి చెందిన కుల్దీప్ కుమార్ను మనోజ్ ఓడించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎనిమిది “చెల్లని” ఓట్లను లెక్కించినట్లయితే, చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుంది.