Chanda Kochhar : ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. వీడియోకాన్ గ్రూప్నకు రుణాల మంజూరు వ్యవహారంలో గత డిసెంబర్ 23న కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే తమను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడికి వివాహం కుదిరిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే బంధువులకు ఆహ్వానాలు పంపించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కొచ్చర్ దంపతులు బాంబే హైకోర్టును కోరారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కొచ్చర్ దంపతుల అరెస్టు చట్ట ప్రకారం జరగలేదని స్పష్టం చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తు కింద చెరో రూ.లక్ష జమ చేయాలని కొచ్చర్ దంపతులను ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సహకరించాలని సూచించింది. సీబీఐ సమన్లు జారీ చేసినప్పుడు హాజరుకావాలని ఆదేశించింది. వారి పాస్పోర్టులను సీబీఐకి సమర్పించాలని న్యాయస్థానం నిర్దేశించింది.
వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు 2012లో మంజూరు చేసిన రుణాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు చందా కొచ్చర్ దంపతులపై ఆరోపణలు వచ్చాయి. అప్పుడు బ్యాంకు సీఈఓ హోదాలో చందా కొచ్చర్ రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేశారు. ఈ రుణం ఎన్పీఏగా మారడంతో ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. వీడియోకాన్కు మంజూరు రుణంలో కోట్ల రూపాయలను దీపక్ కొచ్చర్ నిర్వహించే న్యూపవర్లో వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులుగా పెట్టినట్లు నిర్ధారించింది. ఈ కేసులో చందా కొచ్చర్ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఐపీసీ, మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్తోపాటు వీడియోకాన్ గ్రూపునకు చెందిన వేణుగోపాల్ ధూత్, న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్లపై ఎఫ్ఐఆర్ను సీబీఐ నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ విచారణలో భాగం కొచ్చర్ దంపతులను అరెస్ట్ చేసింది.