Kisaan ki Baat| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేడియో ప్రోగామ్ ‘మన్ కీ బాత్’ లాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా ఓ రేడియా కార్యక్రమం తీసుకురాబోతోంది. ప్రతినెల ఓ ఎపిసోడ్ ఉండే ఈ కార్యక్రమం సెప్టెంబర్ నుంచి ప్రారంభం చేయబోతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (ShivRaj Singh Chouhan) గురువారం సాయంత్రం ప్రకటించారు. రైతులకు వ్యవసాయానికి సంబంధించి శాస్త్రీయ సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రతినెలా చేసే మన్ కీ బాత్ రేడియా టాక్ షో తరహాలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రైతులకు వ్యవసాయ విధానాలలో కొత్త పద్ధతులను తెలిపేందుకు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, స్వయంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనలిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.
”దేశంలోని చాలామంది రైతులకు వ్యవసాయానికి సంబంధించి ఆధునిక పద్ధతులు గురించి అవగాహన లేదు. వ్యవసాయంలో పురుగుమందులు వాడకం తెలియక చాలా నష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతులకు ఉపయోగపడేలా త్వరగా శాస్త్రీయ సమాచారం ఈ కార్యక్రమం ద్వారా చేరుతుంది,” అని కేంద్ర మంత్రి అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ (NPSS) ప్రారంభోత్స కార్యక్రమానికి రైతులతో చర్చించినప్పుడు తనకు ఈ కార్యక్రమం ప్రారంభించాలనే ఆలోచన కలిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ”వ్యవసాయ శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణల గురించి రైతులకు సమాచారం అందించాలి. శాస్త్రవేత్తలతో రైతులను కలిపే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయంలో కలిగే లాభాలు రైతులకు వెంటనే అందాలని, వాళ్లకు పురుగులమందుల వల్ల కలిగే నష్టాలను తగ్గించాలని ప్రతినెల కిసాన్ కీ బాత్ నిర్వహిస్తాం,” అని మంత్రి చౌహాన్ చెప్పారు.
”ఈ కార్యక్రమం రేడియో ద్వారా ప్రసారమవుతుంది. ఈ వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, నేను.. అందరం పాల్గొంటాం. రైతులకు అవసరమైన సమాచారమంతా అందిస్తాం. ఇకపై క్రిషి విజ్ఞాన్ కేంద్రపైనే రైతులు ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కొత్త ఆవిష్కరణల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించి.. వారికి పంట దిగుబడి పెంచే విధానాల గురించి సూచనలిస్తాం. త్వరలోనే శాస్త్రవేత్తలు, రైతు సంఘాలతో చర్చించి దేశాన్ని వ్యవసాయం ద్వారా అద్భుత ఆహార ధాన్యాగారంగా మార్చాలనేది మా లక్ష్యం.” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
Also Read: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. స్వాతంత్ర్య దినోత్సవం వేళ సంచలన నిర్ణయం
కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేశాయని, ప్రధాన మంత్రి మోదీ రైతుల కోసం ఎంతో చేశారని ఆయనకు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు రామ్ నాథ్ ఠాకుర్, భగీరథ్ చౌదరితోపాటు, ఐకార్ (ICAR) డైరెక్టర్ జెనెరల్ హిమాన్షు పాఠక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్ను సమం చేసిన ప్రధాని మోదీ..