All Party Meeting(Politics news today India):
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో వచ్చే నెల 2న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.
వచ్చే నెల 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లో ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఎవిడెన్స్ చట్టాలకు సంబంధించిన మూడు కీలకమైన బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. అంతేగాకుండా చీఫ్ ఎలక్షన్ కమిషనర్.. ఎలక్షన్ కమిషనర్లను నియమించే విధానానికి సంబంధించిన బిల్లు కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉంది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
సాధారణంగా, శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలో ప్రారంభమై.. డిసెంబర్ 25 లోపు పూర్తి కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కొన్ని రోజులు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా అంశంపై వాడి వేడి వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.