Citizenship Amendment Act Notification: ఎంతో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం-2019 (Citizenship Amendment Act – CAA)కు సంబంధించిన విధి విధానాలు, అమలు నిబంధనలను.. నాలుగేళ్ల తర్వాత నేడు ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వీటిని గెజిట్ విడుదల చేసింది.
పౌరసత్వ సవరణ చట్టం – 2019 కి డిసెంబర్ లోనే రాష్ట్రపతి అనుమతి లభించింది. కేబినెట్ ఆమోదం కూడా వచ్చింది. కానీ.. దీనిపై నిబంధనలు ఇంతవరకూ రాకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. తాజాగా ఈ చట్టం విధివిధానాలపై కేంద్రం ప్రకటన చేసింది. లోక్ సభ ఎన్నికలకు మరో నాలుగురోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో.. అంతకంటే ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం భావించింది.
ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షా సైతం దీనిపై మాట్లాడారు. CAAపై లోక్ సభ ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నేతల వాగ్ధానమేనని షా తెలిపారు. దేశ విభజన తర్వాత పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న వారికి పౌరసత్వం కల్పిస్తామని వాగ్ధానం చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత దానిని నుంచి వెనక్కి తగ్గిందన్నారు. సీఏఏ పేరు చెప్పి ముస్లింలను భయపెడుతున్నారని, నిజానికి దీనివల్ల ఎవరి పౌరసత్వానికీ ఇబ్బంది ఉండదని తెలిపారు.
Read More: కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై వివాదం.. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్..
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ లలో హింసకు గురై భారత్ కు వలసగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇచ్చేందుకు తీసుకొచ్చిన చట్టం సీఏఏ అని అమిత్ షా వివరించారు. ఈ ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే జరుగుతుంది. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. దీనిపై కీలక ప్రకటన చేస్తారని సమాచారం.