Central to Announce Bharata Ratna for NTR: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. ఇది తెలుగు ప్రజల కోరిక. ఇప్పటి కోరిక కాదిది. కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించిన ప్రతీసారి ఆ లిస్టులో ఎన్టీఆర్ పేరుందేమోనని ఎంతో ఆతృతగా ఎదురుచూసిన క్షణాలు చాలానే ఉన్నాయి. అంతెందుకు ఈ ఏడాది జనవరిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించినపుడు కూడా ఎన్టీఆర్ కు కూడా ఇస్తే బాగుండేదని అనుకోనివారు లేరు. సినిమా నటుడిగానే కాదు.. రాజకీయ నాయకుడిగా, ప్రజల సీఎంగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న పొందే అర్హతలు ఉన్నాయని ఎప్పటి నుంచో చెబుతున్నా.. ఇంతవరకూ దానిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆఖరి కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మార్చి 15న లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేంద్రప్రభుత్వంలో ఇదే ఆఖరి సమావేశం కావడంతో.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చే అంశంపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం.
అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న సమయంలో.. సొంతంగా పార్టీ పెట్టి ఎదురెళ్లి గెలిచిన ధీ శాలి ఎన్టీఆర్. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు సైతం ఒక దిక్సూచిగా కనిపించారాయన. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లోనూ చెరగని ముద్రవేసిన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్నది ఏనాటి నుంచో వినిపిస్తోన్న ప్రధాన డిమాండ్.
Also Read:రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. అనుమానితుడి అరెస్ట్..
దీనిపై కేంద్రానికి ఇప్పటికే అనేక విజ్ఞప్తులు అందగా.. సామాన్య ప్రజలతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల బీజేపీతో పొత్తుల గురించి చర్చించిన సమయంలో కూడా టీడీపీ నేతలు ఎన్టీఆర్ కు భారతరత్న అంశంపై ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే.. ఆయనకు జాతీయ స్థాయిలో నిలువెత్తు గౌరవం దక్కినట్లే.