Ayodhya : అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దశాబ్ధాల కాలంగా ఎదురుచూస్తున్న రామ మందిరం కల సాకారంకానుండటంతో.. దేశమంతా రామజపం పఠిస్తోంది. మరి కొద్ది గంటల్లో అయోధ్యలో మహత్తర ఘట్టమైన ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరగుతున్న ఈ మహోత్సవానికి అన్ని రంగాల ప్రముఖులకు ఆహ్వానించింది అయోధ్య ట్రస్ట్. దీంతో అమృత ఘడియల్లో రామయ్య కొలువుదీరే సన్నివేశాన్ని కనులారా తిలకించేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు.
మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు జరిగే ఈ ప్రాణప్రతిష్ట వేడుకలో ప్రధాని మోదీ సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నటి కంగనా రనౌత్ , అలియా భట్ , అక్షయ్ కుమార్ , అనుపమ్ ఖేర్ , సంజయ్ లీలా బన్సాలీ, అమితాబ్ బచ్చన్ , చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ వంటి అనేక మంది భారతీయ నటులకు ఆహ్వానాలు అందాయి. రణదీప్ హుడా, సోనూ నిగమ్, అనుపమ్ ఖేర్, షెఫాలీ షా వంటి పలువురు ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. అలాగే ప్రాణప్రతిష్టను చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్లు అయోధ్యకు చేరుకున్నారు. వీరి వెంట ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా వెళ్లారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా అయోధ్య బాట పట్టడంతో ఆ ప్రాంతమంతా వీవీఐపీ గెస్టులతో సందడి నెలకొంది. వీరి భద్రతా నేపథ్యంలో అయోధ్యలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తీవ్రవాదుల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాల్లో మొత్తం 13 వేల మందికిపైగా ఖాఖీలు మోహరించారు.