Wayanad Bypoll : రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత వేటు వేయడంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ చర్యను విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. అదే సమయంలో ఓ వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలోనే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ప్రాతినిధ్య వహించిన కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ ను సీఈసీ ప్రకటిస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ గెలుపొందారు. వయనాడ్ స్థానం ఖాళీ అయినట్లు లోక్సభ సచివాలయం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సీఈసీ ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటిస్తుందని భావించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే వయవాడ్ ఉపఎన్నిక షెడ్యూల్ ను మాత్రం ప్రకటించలేదు. అయితే ఈ విషయంపై సీఈసీ రాజీవ్కుమార్ స్పందించారు. వయనాడ్ స్థానం ఉపఎన్నికకు తొందర లేదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చిన విషయాన్ని సీఈసీ గుర్తు చేశారు. ఆ గడువు పూర్తైన తర్వాతే ఉపఎన్నికపై స్పందిస్తామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. చట్ట ప్రకారమే ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించామని చెప్పారు. ఆరునెలల్లో ఎన్నిక నిర్వహించాలన్నారు. అయితే మిగిలిన పదవీకాలం సంవత్సరంలోపే ఉంటే.. అప్పుడు ఎన్నిక నిర్వహించాల్సిన పని లేదని చెప్పారు. కానీ వయనాడ్ విషయంలో ఏడాదికి మించి ఉందన్నారు.
మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ కు ఇటీవల రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్సభ సచివాలయం రాహుల్పై చర్యలు తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ లోక్ సభ స్థానం ఉపఎన్నికపై ఆసక్తి నెలకొంది.