Mumbai BMW Car Accident| ముంబై నగరంలోని వర్లీ ప్రాంతంలో ఆదివారం శివసేన నాయకుడి కుమారుడు నడుపుతున్న BMW కారు వేగంగా వచ్చి ఎదురుగా వెళుతున్న బైక్ ని వెనుక నుంచి ఢీకొట్టడంతో కావేరి అనే 45 ఏళ్ల మహిళ మరణించింది. మహిళతో పాటు బైక్ పై ఉన్న ఆమె భర్త ప్రదీప్ తీవ్రంగా పడ్డాడు. BMW కారు బలంగా ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న దంపతులు గాల్లో ఎగిరి కారు బానెట్పై పడ్డారు. ప్రదీప్ దానిపై నుంచి దూకగా, కావేరిని కారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఆ తరువాత కావేరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె దారిలోనే మృతి చెందింది.
మద్యం మత్తులో కారు నడుపుతున్న 24 ఏళ్ల మిహిర్ షా అనే అనుమానితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ALSO READ: ఆ కుట్ర వల్లే హత్రాస్ తొక్కిసలాట.. భోలే బాబా లాయర్ సంచలన కామెంట్స్ !
మిహిర్ షా ఎవరు?
మిహిర్ షా ఒక రాజకీయ నాయకుడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శివసేన పార్టీ నాయకుడు రాజేష్ షా కుమారుడు. రాజేష్ షా – పాల్ఘర్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీకి చెందిన నాయకుడు. కారు ప్రమాదం కేసులో నిందతుడు పరారీలో ఉండగా.. పోలీసులు అతని తండ్రి రాజేష్ షా, డ్రైవర్ ని నిన్న సాయంత్రం అరెస్టు చేశారు. రాజేష్ షా పేరు మీద BMW రిజిస్టర్ అయింది.
తాజాగా ఈ కేసులో పోలీసులకు సీసీటీవి ఆధారాలు లభించాయి. నిందితుడు మిహిర్ షా తన నలుగురు స్నేహితులతో కలిసి మెర్సిడెస్ కారులో పబ్ నుండి బయలుదేరినట్లు వీడియోలో ఉంది. ఆ తరువాత మార్గం మధ్యలో తన BMW కారుని నడుపుతున్న డ్రైవర్ ని తప్పించి తనే స్వయంగా BMW నడిపాడు. ఆ తరువాత ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆదివారం ఉదయం 5.30 గంటలకు జరిగింది. ప్రమాదం జరగక ముందు పబ్ లో నిందితుడు మద్యం సేవించాడని పోలీసులు తెలిపారు.
కారు ప్రమాదం తరువాత నిందితుడు కారుపై ఉన్న శివసేన పార్టీ స్టికర్ ని, కారు నెంబర్ ప్లేట్ ని తొలగించాడని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం నాలుగు పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. అతని కోసం లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.
నిందితుడు మిహిర్ షాను అతని గర్ల ఫ్రెండ్ దాచిపెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
కారు ప్రమాదానికి కారణమైన మిహిర్ షాకు సహకరించిన అతని డ్రైవర్, నిందితుడు తండ్రి రాజేష్ షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు.
పుణె పోర్చ్ కేసు ప్రమాదం జరిగిన కొద్దిరోజులకే అలాంటి మరో ప్రమాదం ముంబైలోనే జరగడంతో ఈ కేసు వివాదాస్పదంగా మారింది. పైగా ఈ కేసులో నేరుగా అధికార శివ సేన పార్టీ నాయకుడి కుమారుడు నిందితుడు కావడం, అతను పరారీలో ఉండడంతో ఈ కేసు.. రాజకీయంగా ప్రాముఖ్యం సంతరించుకుంది.