CBI Raids Satya Pal Malik’s Premises in Hydel Project Case: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంటిపై సీబీఐ అధికారులు గురువారం దాడులు జరిపారు. 2019లో కిష్టావర్లో కిరు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సివిల్ పనులకు సంబంధించి రూ.2200 కోట్ల ఒప్పందంలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి.
జమ్ముకశ్మీర్ సహా 30 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. వందమందికిపైగా అధికారులు ఉదయం నుంచి జరిగిన ఈ దాడుల్లో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా మాలిక్ ఆస్ప్రతిలో ఉన్నారు. అనారోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా తన ఇంటిపై దాడులు చేశారని, ఈ సోదాల ద్వారా డ్రైవర్ను, సహాయకుడిని అనవరపు వేధింపులకు గురి చేశారని మాలిక్ ఆరోపించారు.
Read More: 7వ పే స్కేల్ అమలు దిశగా చర్యలు.. జీతాలకు 24 శాతం నిధులు పెంపు..
23 ఆగస్టు 2018 నుంచి 30 అక్టోబర్ 2019 వరకు ఆయన జమ్ముకశ్మీర్ గవర్నర్గా పనిచేశారు. పవర్ ప్రాజెక్టు సహా రెండు ఫైళ్లను క్లియర్ చేసినందుకు రూ.300 కోట్ల మేర ముడుపులు అందాయని ఆరోపణలు ఉన్నాయి. చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, మాజీ అధికారులు ఎంఎస్ బాబు, ఎంకే మిట్టల్, అరుణ్ కుమార్ మిశ్రా, పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్పై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత వారం రాజస్థాన్, ఢిల్లీల్లో 12 ప్రాంతాలతో పాటు ఆరుగురిపై సీబీఐ దాడులు జరిపింది. మాలిక్ మాజీ ప్రెస్ సెక్రటరీ సునాక్ బాలి ఇంటిపైనా దాడులు జరిగాయి. ఈ ముడుపుల భాగోతంలో ప్రధాన అనుమానితుడు అతడేనని అధికారులు చెబుతున్నారు.