CBI gets nod to conduct polygraph test of accused: కోల్కతా ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్/ లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సీబీఐ వర్గాలు సోమవారం స్పష్టం చేశాయి. అయితే, మంగళవారం అతడికి ఈ టెస్ట్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండియర్ చదువుతున్న జూనియర్ డాక్టర్ ఆగస్టు 8న రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో సివిక్ సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read: సీఎం మమతా అలా చేస్తారని అనుకోలేదు.. కోల్కతా బాధితురాలి తండ్రి
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసును కోల్ కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే, అదే సమయంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. నిందితుడి వెనుక ఎవరైనా ఉండి ఉంటారనే వార్తలు సైతం వినిపించాయి. ఈ క్రమంలోనే నిజానిజాలను తెలుసుకునేందుకు నిందితుడు సంజయ్ రాయ్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. తాజాగా అందుకు కోర్టు అంగీకరించింది. అదేవిధంగా కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.