NEET-UG Paper Leak: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బీహార్లోని పాట్నా ఎయిమ్స్లో చదువుతున్న వారే కావడం గమనార్హం. అయితే అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతుండగా మరొకరు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు అధికారలు వెల్లడించారు.
ఈ నలుగురు విద్యార్థులను విచారించాల్సి ఉందని సీబీఐ అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. ఎయిమ్స్ సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల సమక్షంలో హాస్టల్ గదుల నుంచి వారిని తీసుకుని వెళ్లారు. అనంతరం వారు ఉంటున్న హాస్టల్ గదులను కూడా సీజ్ చేశారు. వీరిని సీబీఐ అధికారులు తీసుకున్నట్లు ఎయిమ్స్ పట్నా డైరెక్టర్ జీకే పాల్ తెలిపారు. డీన్, హాస్టల్ వార్డెన్, డైరెక్టర్ ఓఎస్డీ సమక్షంలో వారిని అదుపులోకి తీసుకుందన్నారు.
Also Read: ధోతి ధరించాడని రైతును అడ్డుకున్న మాల్కు పనిష్మెంట్
నీట్ పరీక్ష జరగడానికి ముందు జార్ఖండ్లోని హజారీ బాగ్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన ట్రంక్ పెట్టె నుంచి నీట్ పేపర్ లీపర్ దొంగిలించాడన్న కేసులో 2017 బ్యాచ్ ఎన్ఐటీ జంషెడ్పుర్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ను అరెస్ట్ చేసిన తర్వాత వీరిని అదుపులోకి తీసుకోవడం చర్చలకు తావిస్తోంది. అలాగే అతడికి సహకరించిన రాజు సింగ్ను కూడా అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆరు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.