Air India Express: ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. అబుదబీ నుంచి కాలికట్కు వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి అబుదబీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
శుక్రవారం ఉదయం అబుదబీ నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయి 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్నవారికి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ తిరిగి విమానాన్ని అబుదబీలో ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమాన ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని ఎయిరిండియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తిరిగి ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు వివరించింది.