Budget 2024: కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ 2024-25 జూలై 23న లోక్ సభలో సమర్పించేందుకు పూర్తి సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్త బడ్జెట్ పై ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లకు ఒకప్పుడు లభించే ట్రైన్ టికెట్ రాయితీ.. మళ్లీ కల్పిస్తారని చర్చ జరుగుతోంది.
దేశంలో రైలు ప్రయాణం చేసే ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రయాణం ఖర్చు తక్కువ కావడంతో.. రైలు మార్గన్నే ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో వృద్ధ పౌరులకు ట్రైన్ టికెట్పై డిస్కౌంట్ ప్రకటిస్తే.. దీని ప్రభావం లక్షలాది మంది ప్రజలపై ఉంటుంది.
మార్చి 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో రైల్వే శాఖ.. సీనియర్ సిటిజెన్స్ టికెట్ ధర పై ఇచ్చే రాయితీని ఆపేసింది. అంతకుముందు రైలుప్రయాణం చేసే వృద్ధ మహిళలకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ, పురుషులకు, ట్రన్స్ జెండర్లకు 40 శాతం రాయితీ లభించేది. రైల్వ నియమాల ప్రకారం.. 60 ఏళ్లకు పైబడిన పురుషులు, ట్రాన్స్ జెండర్లు.. అలాగే 58 ఏళ్లు వయసు దాటిన మహిళలు సీనియర్ సిటిజెన్ క్యాటగిరీలోకి వస్తారు.
కానీ కొవిడ్ సమయం నుంచి ప్రభుత్వం రాయితీ ఆపేసిన తరువాత సీనియర్ సిటిజెన్లు సైతం మిగతా ప్రయాణికులతో సమానంగా పూర్తి టికెట్ ధర చెల్లించాల్సి వస్తోంది.
Also Read: కొత్త బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్లో ఏది ఉచితం?
సీనియర్ సిటిజెన్ రాయితీ నిలిపివేసిన తరువాత రైల్వే శాఖకు భారీ ఆదాయం
ఆర్టిఐ(RTI) నుంచి అందిన సమాచారం ప్రకారం.. సీనియర్ సిటిజెన్లకు ఇచ్చే రాయితీ నిలిపివేసిన తరువాత రైల్వే శాఖకు ఆదాయం భారీగా పెరిగింది. ఈ విషయంపై రాజకీయ వివాదం కూడా తలెత్తిన సందర్భాలున్నాయి. ఇప్పుడు రైలు టికెట్ ధరలో సీనియర్ సిటిజెన్ల రాయితీ ఇచ్చేందుకు రైల్వే శాఖ ఆలోచిస్తోందని తెలిసింది. దీనివల్ల సామాజానికి చాలా మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫిబ్రవరి 2024లో మోదీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇంటరిమ్ బడ్జెట్ ని పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు ఒక విలేకరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని సీనియర్ సిటిజెన్ లకు టికెట్ పై రాయితీ తిరిగి ప్రారంభిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. “ఇప్పటికే భారతీయ రైల్వే ప్రయాణికులందరికీ చాలా తక్కువ ధరకే సేవలందిస్తోంది.. అందరికీ టికెట్ ధరలో 55 శాతం రాయితీ ఇస్తున్నాం.” అని చెప్పారు.
రైల్వే శాఖకు సీనియర్ సిటిజెన్ల రాయితీ నిలిపివేసిన తరువాత ఎంత ఆదాయం వచ్చింది అని ఓ వ్యక్తి ఆర్టిఐ ఫైల్ చేశాడు. దానికి వచ్చిన సమాధానం చాలా షాకింగ్ గా ఉంది. మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ ఆర్టిఐ ద్వారా ఈ విషయంలో సమాచారం సేకరించారు. ఆర్థిక సంవత్సరం 2022-23లో 15 కోట్ల మంది సీనియర్ సిటిజెన్లు రైలు ప్రయాణం చేశారు. వీరి ద్వారా రైల్వే శాఖకు 2242 కోట్ల ఆదాయం వచ్చింది.
కోవిడ్ సమయంలో రాయితీ నిలిపివేశారు సరే.. మరి త్వరలోనే ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2024లో నైనా సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్ ధరలో రాయితీ ఇస్తారా? అనే ప్రశ్నకు సమాధానం కోసమే ఇప్పుడంతా ఎదురుచూస్తున్నారు. ఇది ప్రభుత్వ పాలసీలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.. సామాజిక విలువలను ప్రతిబింబిచే అంశం కూడా. ఈ రాయితీ.. వృద్ధ పౌరుల సంక్షేమం, సమాజంలో వారి ప్రాధాన్యం, ప్రభుత్వం వారి పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతను కూడా సూచిస్తుంది.