Brij Bhushan Singh : రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు ఊరట లభించింది. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. 25 వేల పూచీకత్తుపై 24 గంటల పాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ కు సంబంధించి న్యాయస్థానం బ్రిజ్ భూషన్ కు సమన్లు జారీ చేయగా.. మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు.
మరోవైపు లైంగిక వేధింపుల కేసులో ఆధారాలున్నాయని పోలీసులు ప్రకటించినా.. ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదన్న దానిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఏడేళ్లు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సహకరిస్తే వారిని అరెస్ట్ చేయరాదన్న కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. బ్రిజ్ కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు దొరికాయన్న ఢిల్లీ పోలీసులు.. మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు.
కొన్ని నెలలుగా మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో బ్రిజ్ భూషణ్ ను విచారించిన ఢిల్లీ పోలీసులు.. పలు ఆధారాలు సేకరించారు. ఇన్నాళ్ల విచారణ తర్వాత జూలై 15 న రౌస్ ఎవెన్యూ కోర్టులో చార్జీషీట్ నమోదు చేశారు.