BrahMos missile at China border : బ్రహ్మోస్ (BrahMos) క్షిపణి పరిధి పెంచిన తర్వాత చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది. సుఖోయ్-30MKI (Sukhoi-30MKI) యుద్ధవిమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ బంగాళాఖాతంలోని లక్ష్యంగా ఉంచిన ఓ ఓడను విజయవంతంగా ఢీకొట్టింది. బ్రహ్మోస్ను 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించడానికి ముందుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు దాన్ని 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే విధంగా అభివృద్ధి చేశారు. క్షిపణి పరిధి పెంచిన తర్వాత రెండోసారి చేసిన ప్రయోగం కూడా సక్సెస్ కావడంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ హర్షం వ్యక్తం చేసింది.
ధ్వని వేగానికి మూడు రెట్లు వేగంగా బ్రహ్మోస్ దూసుకెళ్తుంది. సుఖోయ్ యుద్ధవిమానాల నుంచి దీన్ని పరీక్షించడం వెనుక ఎయిర్ఫోర్స్కు పెద్ద వ్యూహమే ఉంది. సుఖోయ్ జెట్లలో ఒక్కసారి ఇంధనం నింపితే 1500 కిలోమీటర్లు ఆగకుండా దూసుకెళ్తాయి. దానికి పరిధి పెంచిన బ్రహ్మోస్ తోడైతే దాదాపు 2 వేల కిలోమీటర్ల లోపున్న టార్గెట్ను సులువుగా కొట్టవచ్చు. అంటే.. అటు పాకిస్తాన్ మొత్తం, చైనాలో కీలక నగరాలన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఈ రెండూ కలిస్తే అటు పాకిస్తాన్, ఇటు చైనాకు దబిడిదిబిడే అంటున్నారు డీఆర్డీవో, ఎయిర్ఫోర్స్ ప్రతినిధులు.
సుఖోయ్ ద్వారా బ్రహ్మోస్ను ప్రయోగించి భూమ్మీద లక్ష్యాలతో పాటు, సముద్రతలంపై ఉన్న లక్ష్యాలను కూడా చేధించవచ్చు. బంగాళాఖాతాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చైనా కుట్రలు చేస్తున్న సమయంలో బ్రహ్మోస్ మిసైల్ సిద్ధం కావడం మన వాయుసేన ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసింది. అటు బ్రహ్మోస్ క్షిపణి పరిధిని 800 కిలోమీటర్లకు పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం కూడా చైనా సరిహద్దుల్లో బ్రహ్మోస్ మిసైల్స్ను మోహరించింది. అటు నేవీ కూడా పది యుద్ధనౌకల్లో వీటిని చేర్చింది.