BoreWell: బోరుబావిలో పడిన చిన్నారి చనిపోయింది. 52 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత.. ఆ పాపను 100 అడుగుల లోతైన బోరుబావి నుంచి వెలికితీశారు అధికారులు. వెంటనే ఆసుపత్రికి తలలించగా.. అప్పటికే ఆ చిన్నారి చనిపోయిందని వైద్యులు చెప్పడంతో.. మధ్యప్రదేశ్ ఘటన విషాదాంతమైంది.
మంగళవారం మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలో ముంగావలి గ్రామంలోని వ్యవసాయ భూమిలో రెండున్నరేళ్ల చిన్నారి సృష్టి కుమారి.. ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది. పాప మొదటగా 30 అడుగుల లోతులో చిక్కుకోగా.. తర్వాత 50 అడుగులకు పడిపోయింది. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా.. తవ్వకం, డ్రిల్లింగ్ ప్రకంపనలతో ఆమె బోర్వెల్ లోపల 100 అడుగుల లోతుకు జారిపోయింది.
బోర్ వెల్ కు సమాంతరంగా ఆర్మీ బృందం తవ్వకాలు చేపట్టింది. రాడ్లు, తాడు వేసి బాలికను రక్షించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రోబోను సైతం వాడారు. మధ్యలో రాయి అడ్డురావడంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా క్లిష్టంగా మారింది. చిన్నారిని రక్షించడానికి ఢిల్లీ, రాజస్థాన్ నుంచి బృందాలను రప్పించారు. బోరుబావిలో చిక్కుకున్న చిన్నారికి నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేశారు. ఘటనపై సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం స్పందించారు.
రెండు రోజులకుపైగా రెస్క్యూ ఆపరేషన్ తర్పాత.. గురువారం సాయంత్రం పాపను బయటకు తీసుకురాగలిగారు. అయితే, ఊపిరాడక ఆ చిన్నారి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.