Border Dispute : మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేసింది. ఇరురాష్ట్రాల్లో ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో వివాదం మరింత ముదిరింది. వాహనాలపై పరస్పరం దాడులకు దిగడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారం రాత్రి ఫోన్ లో సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు.
మరోవైపు.. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్నాటకలో నిరసనకారులు దాడులు దిగారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కర్నాటకకు బస్సు సర్వీసులను నిలిపేసింది. కర్నాటకలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మళ్లీ పోలీసులు అనుమతులు ఇచ్చిన తర్వాతే బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
వివాద నేపథ్యం
కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం 1957 నుంచి ఉంది. ప్రస్తుతం కర్ణాటకలోని బెళగావితోపాటు మరాఠా మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు బ్రిటీష్ వారి కాలంలో బాంబే ప్రెసిడెన్సీలో ఉండేవి. బెళగావి నగరాన్ని, ఆ 814 గ్రామాలను 1957లో కర్ణాటకలో విలీనం చేశారు. ఈ నిర్ణయంపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాంతాలు తమవేనని అప్పటి నుంచి మహారాష్ట్ర వాదిస్తోంది. దీంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
బెళగావి తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక తేల్చిచెబుతోంది. అక్కడ విధాన సౌధను పోలిన సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఏడాదికోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. మొత్తంమీద ఆ ప్రాంతంపై వివాదం ఆరున్నర దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇరురాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని మేధావులు సూచిస్తున్నారు.