Flight Emergency Landing : ఆ విమానం మాస్కో నుంచి గోవాకు వస్తోంది. అప్పటికే భారత్ గగనతలంలోకి ప్రవేశించింది. కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోబోతోంది. ఇంతలోనే ప్రయాణికులకు షాక్ తగిలే వార్త వినిపించింది. ఆ విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది.
విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గోవాకు వెళ్లాల్సిన విమానాన్ని గుజరాత్లోని జామ్నగర్కు మళ్లించారు. అక్కడే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 244 మంది విమానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ ఫ్లైట్ లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని వెల్లడించారు. బాంబు లేదని తేల్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు సమాచారం రాగానే NSG సిబ్బంది అలెర్ట్ అయ్యారు. అత్యవసర ల్యాండింగ్ అయిన విమానం వద్దకు చేరుకుని లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానంలో అణువణువు గాలించారు. ఎన్ఎస్జీ సిబ్బందికి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఈ విమానం చాలా పెద్దది. దీంతో తనిఖీలు చేసేందుకు చాలా సమయం పట్టిందని అధికారులు తెలిపారు. చివరకు విమాన క్యాబిన్ లోని మొత్తం లగేజ్ ను తనిఖీ చేసిన తర్వాత బాంబు లేదని తేల్చామని జామ్నగర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. తనిఖీలన్నీ పూర్తైన విమానాన్ని జామ్నగర్ నుంచి గోవాకు విమానం పంపే ఏర్పాట్లు చేశారు.