J&K Haryana election results 2024: హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో కలవరం మొదలైందా? ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందని ఆ పార్టీ పెద్దలకు ముందే తెలుసా? బీజేపీలో మోదీ శకం ముగుస్తుందా? మోదీ తర్వాత నెక్ట్స్ ఎవరు?వీటి ప్రభావం రానున్న మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందా? అందుకే జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్- హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కమలనాథులకు మింగుడు పడడం లేదు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో దూసుకుపోతోంది హస్తం పార్టీ. దీంతో హస్తం వికాసం మొదలైనట్టు కనిపిస్తోంది. రెండు రాష్టాల్లో కమలం ఓడిపోతుందని ముందే ఆ పార్టీకి కీలక నేతలకు తెలుసా? పార్టీలో అంతర్గత విబేధాలే ఓటమికి కారణమా? లేక మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలే కారణమా? అనేదానిపై కమలనాధుల్లో అంతర్మథనం మొదలైనట్టు కనిపిస్తోంది.
ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. హర్యానా ప్రజలు ఇప్పటివరకు ఒకేపార్టీకి మూడోసారి పగ్గాలు అప్పగించిన చరిత్ర లేదు. చరిత్ర చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో 1962,1972, 2005,2009 ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టారు ఓటర్లు. 2014, 2019ల్లో కమలనాథులకు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి హర్యానాలో బీజేపీ ఓడిపోతుందని స్పష్టమైన సంకేతాలు ఆ పార్టీ వచ్చాయి. పరిస్థితి గమనించిన బీజేపీ హైకమాండ్, ఖట్టర్ను తొలగించి బీసీ నేతలకు అప్పగించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
హర్యానా పేరు చెప్పగానే జాట్ల పేరు గుర్తుకొస్తుంది. 37 నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం ఉంది. ఇది హర్యానా అసెంబ్లీలో 40 శాతం అన్నమాట. రెండుసార్లు పార్టీకి ఛాన్స్ ఇచ్చినా తమ కమ్యూనిటీని దూరంగా పెట్టింది. ఈ కారణంగానే పదేళ్లు ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా పెట్టిందనే భావన వారిలో నెలకొంది.
ALSO READ: నేడే జమ్మూకశ్మీర్, హర్యానా రిజల్ట్స్.. ఫలితాలపై ఉత్కంఠ!
దీనికితోడు సైన్యంలో అగ్నిపథ్ వ్యవస్థను తీసుకురావడాన్ని తప్పుబట్టారు అక్కడి యువతీ యువకులు. మరొకటి మద్దతు ధర చట్ట బద్దత కోసం రైతులు చేసిన ఆందోళనను పట్టించుకోకపోవడం, రెజ్లర్ల ఆందోళన ఇవన్నీ కలిసి కమలనాథులపై తీవ్ర ప్రభావం చూపాయనే చెప్పవచ్చు.
హర్యానాలో దాదాపుగా జాట్లదే ఆధిపత్యం. ఆ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఆ వర్గానికి చెందినవారే ఉన్నారు. జాట్ నేతలైన దేవీలాల్, బన్సీలాల్, ఓ ప్రకాశ్ చౌతాలా, హుశంసింగ్ పొగాట్, భూపేందర్ సింగ్ హుడ్డా ముఖ్యమంత్రులు అయ్యారు. గడిచిన పదేళ్లుగా వారి ప్రాబల్యం తగ్గింది. ఈసారి ఎన్నికలు జాట్లే కేంద్రంగా ఎన్నికలు జరిగాయి.
ఇక జమ్మూకాశ్మీర్ విషయంలో బీజేపీ పరిపాలనను ఎండగట్టాయి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్. ఈ రెండు పార్జీలు కలిసి మేజిక్ ఫిగర్ను దాటేశాయి. గడిచిన పదేళ్లుగా జమ్మూకాశ్మీర్లో బీజేపీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.
హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలు.. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పడతాయని అంటున్నారు. ఒకప్పుడు మహారాష్ట్రలో బీజేపీ బలంగా ఉండేది. కాకపోతే శివసేన, ఎన్సీపీని విభజించి పాలించడాన్ని మెజార్టీ మరాఠాలు జీర్ణించుకోలేకపోయారు. దాని కారణంగా గత లోక్సభ ఎన్నికల్లో కమలనాథులకు షాకిచ్చారు. ఇవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ కావచ్చనే సంకేతాలు బలంగా వున్నాయి.
ఢిల్లీ విషయానికొద్దాం.. బీజేపీ వ్యూహాలను గమనించారు ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్లో బెయిల్పై విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీపై మహిళను కూర్చొబెట్టారు. దీంతో ఢిల్లీ ఓటర్లలో ఆ పార్టీ మరింత ఇమేజ్ పెరిగింది. బలమైన పోటీ ఇవ్వాలని భావించారు కమలనాథులు. కేజ్రీవాల్ ఎత్తులకు బీజేపీ చిత్తయ్యిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్తో కలిసి ఆప్ పోటీ చేస్తే హస్తిన పీఠం బీజేపీ అందుకోవడం కష్టమేనని అంటున్నారు.
ఉత్తరాదిలో ప్రజలు రిజక్ట్ చేస్తే కష్టమనే అభిప్రాయం అప్పుడే కమలనాథుల్లో మొదలైంది. గడిచిన పదేళ్లు మోదీ హవా మీద గెలిచామని చెప్పుకుంటూ కాలం గడిపేశారు కీలక నేతలు. రాష్ట్రాల ఫలితాలతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు నేతలు.
ఇక బీజేపీలో మోదీ శకం ముగిసినట్టేనన్న వాదన ఓ వర్గంలో మొదలైంది. పరిస్థితి జఠిలం కాకముందే మేల్కొంటే మంచిందని, లేకుంటే కష్టమని అంటున్నారు. ఈ క్రమంలో జమిలి ఎన్నికలకు తెరపైకి తెచ్చిందని అంటున్నారు. ఈ ఫలితాలతో కమలనాథుల్లో కనువిప్పు కలిగేనా? వ్యక్తి పూజ కంటిన్యూ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలాల్చివుంది.