Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అధిక సీట్లు వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 60. అందులో మూడింట రెండొంతులకు పైగా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జాతీయ అగ్రనేతలు కూడా రాష్ట్ర నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న రెండు లోక్ సభ స్థానాలు కూడా తమవేనంటూ బీజేపీ సీఎం పెమా ఖండూ, సీనియర్ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
కాగా, దేశంలో 2024 లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగగా, ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది.. ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది అంటూ తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు.
Also Read: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్
అయితే, ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి.. దీంతో తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ధీమాను వ్యక్తం చేశారు. ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. అందులో మాత్రం బీజేపీకి ఎక్కువగా మొగ్గు చూపాయి. వీటిపై స్పందించిన పలువురు నేతలు ఆ ఎగ్జిట్ పోల్స్ సరికావు.. అంతా అబద్ధమంటూ కొట్టిపారేశారు.