Three States Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లో బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 70 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఛత్తీస్ గఢ్ లో కూడా బీజేపీ లీడింగ్ లోకి వచ్చింది. బీజేపీ 54 స్థానాల్లో లీడింగ్ లోకి రాగా.. కాంగ్రెస్ 34 స్థానాల్లో ముందంజలో ఉంది. రాజస్థాన్ లో బీజేపీ 107 స్థానాల్లో, కాంగ్రెస్ 76 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. ఇతరులు 15 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
తొలుత ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ – బీజేపీల మధ్య హోరాహోరీ పోరు కనిపించగా.. ఉదయం 11 గంటలయ్యే సరికి మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ లీడింగ్ లోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి లీడింగ్ లోకి రావడంతో.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మాదేనని ట్వీట్ చేశారు. పూర్తి స్థాయి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ఓటర్లపై తనకు నమ్మకం ఉందని, ప్రజల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరవ్వాలనేది అధిష్టానం నిర్ణయమన్నారు.