BJP Focus On Elections : సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుందా..? అందులో భాగంగా కేంద్రమంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకుంటాయా..? రాష్ట్రాల్లో పార్టీ పరంగా సంస్థాగత మార్పులు ఉంటాయా..? దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పెద్దలు సమావేశం కావడం.. రకరకాల చర్చలకు దారి తీస్తోంది. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన సమావేశంలో.. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తోపాటు పలువురు సీనియర్లు హాజరయ్యారు. దాదాపు 5 గంటలపాటు నిర్వహించిన ఈ సమావేశంలో.. కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలపై ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. కేంద్ర మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో.. హోంమంత్రి అమిత్ షాతో పాటు.. జేపీ నడ్డా, బీఎల్ సంతోష్.. పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. అక్కడి నాయకత్వ మార్పులు, సంస్థాగతంగా చేపట్టాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. అందులో భాగంగానే.. ఇటీవలే తెలంగాణ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ.. హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా.. బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా.. కేంద్ర కేబినెట్ లో మార్పులు ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించేలా.. మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న మంత్రులను తప్పించి.. కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.