BJP First List for Loksabha Elections 2024(Telugu news headlines today): వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టార్గెట్ 400ను చేధించాలన్న సంకల్పంతో ఉన్న బీజేపీ గెలుపు గుర్రాలకోసం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కన్నా ముందుగానే 100 మంది అభ్యర్థులతో తొలిజాబితా ప్రకటించేందుకు బీజేపీ సన్నాహాలు పూర్తి చేసింది. ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ జాబితా ఖరారైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల కీలక నేతలతో చర్చలు జరిపి ఈ జాబితాను రూపొందించారు.
2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తొలివిడతగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్,చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, త్రిపుర తదితర రాష్ట్రాల నేతలు బుధవారం పార్లమెంటరీ బోర్డు మీటింగ్కు హాజరై తమ నివేదికలు అందజేశారు. ఒక్కో లోక్సభ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో ఉన్న జాబితాలను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించారు. ఈ జాబితాల ఆధారంగా 100మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్ల. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీతో ఈ వారంలో జరిగే సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ తొలిజాబితాను ప్రకటించనున్నారు.
Read More : తమిళనాడు మాజీ మంత్రికి ఎదురుదెబ్బ.. బెయిల్ నిరాకరించిన హైకోర్టు
బీజేపీ తొలిజాబితా విడుదల కానున్న నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎంపీలు, టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో నిన్న జరిగిన బీజేపీ కేంద్రకమిటీ సమావేశంలో దాదాపు 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నేతలు పాల్గొన్నారు. అభ్యర్థుల పనితీరు, ప్రజాదరణ,గెలిచే అవకాశాలు, వ్యతిరేకాంశాలపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం ఫైనల్గా ఎవరివైపు మొగ్గుచూపుతుందనే విషయమై నేతల్లో ఆందోళన నెలకొంది. సిట్టింగ్ ఎంపీలలో ఎంతమందిపై ప్రజా వ్యతిరేకత ఉందనే విషయమై కూడా కేంద్రనాయకత్వం వద్ద నివేదికులు సిద్ధంగా ఉన్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న 160 స్థానాలను గుర్తించిన హైకమాండ్ ఆయా ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అక్కడ కూడా గెలిచే వ్యూహాలను విజయవంతంగా అమలు చేస్తే టార్గెట్ 400 చేరుకోవచ్చనే భావనలో బీజేపీ హైకమాండ్ ఉంది.
తొలి జాబితా ఖరారుకు సంబంధించి అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్లు పలు రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో పలు దఫాలుగా తర్జనభర్జనలు జరిపారు. మధ్యప్రదేశ్,రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, గోవా, త్రిపుర, అరుణాచలప్రదేశ్, ఝార్ఖండ్, హర్యాణా, అండమాన్ నికోబార్ఐలాండ్స్, జమ్మూకశ్మీర్, అస్సోం, ఉత్తరాఖండ్, దాదర్ అండ్ నాగర్ హైవేలీ, డామన్ డయూ నేతలతో ఈ మేధో మథనం జరిగింది.
ఢిల్లీ బీజేపీ అధినాయకత్వం ఏడు పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి 25-30మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను కేంద్ర కమిటీకి అందజేసింది. వీరిలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, దివంగత నాయకురాలు సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరితోపాటు సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖి ఉన్నట్టు సీనియర్ బీజేపీ నేత ఒకరు వెల్లడించారు. ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్, నార్త్ వెస్ట్ ఢిల్లీ ఎంపీ హన్ రాజ్ హన్స్ మినహా మిగిలిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు రెండోసారి వారి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.