Nelson Mandela: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సన్నద్ధమయ్యాయి. అస్తశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలపై స్థానిక పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు పెద్ద ఆశలు పెట్టుకోగా.. ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత తమ బలాన్ని పరీక్షించుకుంటున్న బీజేపీ కూడా పక్కా ప్లాన్తో దిగుతున్నది. జమ్ము కశ్మీర్లో ప్రచారాన్ని విస్తృతంగా చేపడుతున్నది. జమ్ము కశ్మీర్లోని సురన్కోట్(ఇది జమ్ము రీజియన్లోని ఎస్టీ రిజర్వ్డ్ స్థానం) నియోజకవర్గం నుంచి బీజేపీ 75 ఏళ్ల ముష్తక్ బుఖారీని బరిలోకి దింపింది. ఈయనను మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాతో పోల్చుతున్నది. ఇంతకీ ఈ ముష్తక్ బుఖారీ ఎవరు? ఆయనకు జమ్ము కశ్మీర్లో ఉన్న ప్రాధాన్యత ఏమిటీ? ఆయన సాధించిన విజయాలు ఏమిటీ?
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బుఖారీ పై ప్రశంసలు కురిపించారు. జమ్ము కశ్మీర్లో పహారీ కమ్యూనిటీకి స్వాతంత్ర్యం కల్పించిన యోధుడు అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాలతో పోల్చారు. జమ్ము కశ్మీర్లో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న తరుణ్ చుగ్.. బుఖారీ కోసం ప్రచారం చేస్తున్నారు. పహారి కమ్యూనిటీకి ఎస్టీ స్టేటస్ తీసుకురావడానికి పోరాడారని వివరించారు.
‘మహాత్మా గాంధీ చేసిన పనిని ఎవరమూ మరిచిపోలేం. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా నెల్సన్ మండేలానూ ఎవరూ మర్చిపోరు. పహారీ వర్గానికి స్వేచ్ఛను అందించిన ఇక్కడి మహాత్మా గాంధీ, ఇక్కడి నెల్సన్ మండేలా మన బుఖారీ సాహబ్’ అని తరుణ్ చుగ్ పొగిడారు. నేషనల్ కాన్ఫరెన్స్తో నాలుగు దశాబ్దాలపాటు బుఖారీ కొనసాగారు. 2022 ఫిబ్రవరిలో ఆ పార్టీని వీడారు. పహారి కమ్యూనిటీకి ఎస్టీ హోదా విషయమై ఫరూఖ్ అబ్దుల్లాతో విభేదాలు మొదలై ముష్తాక్ బుఖారీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని వదిలిపెట్టారు.
Also Read: Ganesh Nimajjanam 2024: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనాలపై దుష్ప్రచారం.. మంత్రి పొన్నం క్లారిటీ
రెండేళ్ల తర్వాత ఫిబ్రవరి 15న బుఖారీ బీజేపీలో చేరారు. పహారి కమ్యూనిటీకి ఎస్టీ హోదా ఇస్తుందనే హామీతోనే తాను బీజేపీలో చేరినట్టు బుఖారీ వెల్లడించారు. పూంచ్ జిల్లా సురన్కోట్ నుంచి రెండు సార్లు గెలిచిన బుఖారీ.. ఫరూఖ్ అబ్దుల్లాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ముస్లిం కమ్యూనిటీలో పీర్ సాహబ్ అని పిలుచుకునే బుఖారీని ఆధ్యాత్మిక గురువుగా పూజిస్తారు. రజౌరీ, పూంచ్, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో 12.5 లక్షల మంది జనాభాతో విస్తరించి ఉన్న ఈ పహారి కమ్యూనిటీకి ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఫిబ్రవరిలో పార్లమెంటులో పహారి కమ్యూనిటీకి ఎస్టీ హోదాకు ఆమోదం లభించింది. పహారితోపాటు పద్దారి తెగ, కోలీస్, గద్ద బ్రాహ్మణుల తెగలకూ ఎస్టీ హోదాను కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించుకుంది. దీంతో ముష్తాక్ బుఖారీ జమ్ము కశ్మీర్లో బీజేపీకి బ్రహ్మాస్త్రంగా ఉన్నారు. ఆయన ప్రభావంతో బీజేపీ సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నది. సురన్కోట్ నియోజకవర్గానికి జమ్ము కశ్మీర్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల్లో భాగంగా సెప్టెంబర్ 25వ తేదీన పోలింగ్ జరగనుంది.