Nine injured in Stampede at Jehanabad’s Baba Siddhanath Temple: బీహార్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. జెహానాబాద్ జిల్లాలోని మగ్ధుంపూర్ బర్వావర్ కొండపై ఉన్న బాబా సిద్ధనాత్ ఆలయంలో భక్తులు ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. అదే విధంగా ఈ తొక్కసలాటలో తొమ్మిది మందికి పైగా గాయపడడంతో వెంటనే ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే అక్కడి పరిస్థితులను జెహానాబాద్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ అలంకృత పరిశీలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ సిబ్బంది చెప్పారు.
ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో తొక్కిసలాట జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రావణ మాసంలో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, దాదాపు 30 రోజుల పాటు ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయని భక్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామున జరగనున్న పూజల కోసం ఆదివారం రాత్రే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ పెరగడంతోనే తోపులాట జరిగి చివరికి తొక్కిసలాట పరిస్థితులకు దారి తీసిందని స్థానికులు చెబుతున్నారు.
Also Read: హిండెన్ బర్గ్ ఆరోపణలు.. ప్రధానిపై రాహుల్ సెటైర్లు
తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు జెహానాబాద్ ఇన్స్పెక్టర్ దివాకర్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే, తొక్కిసలాటకు దారీతీసిని కారణాలపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, అధికారులు భద్రత లోపంతోనే తొక్కిసలాటకు దారితీసిందని ఆరోపిస్తున్నారు.