Bihar Politics : మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. బిహార్లో నితీష్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి నిట్టనిలువుగా చీలిపోయింది. దీంతో కమలనాథులతో తిరిగి నితీష్ మరోసారి సర్కారు ఏర్పాటుకు రాజభవన్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలను ఒక్కటి చేసి, పాట్నా కేంద్రంగా ఇండియా కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసిన తనకు, తర్వాత జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదని నితీష్ రగిలిపోతున్నారు. మరోవైపు బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ కుమారుడైన తేజస్వీ యాదవ్ వ్యవహార శైలితోనూ నితీష్ విసిగిపోయినట్లు తెలుస్తోంది.
వీటికి తోడు మోదీ సర్కారు బీసీ నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్కు భారతరత్న పురస్కారం ప్రకటించటం, పొరుగునే ఉన్న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభ ప్రభావం కూడా వచ్చే బిహార్ ఎన్నికల మీద ఉంటుందని నితీష్ అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వాదనకు బలం చేకూర్చుతూ రిపబ్లిక్ డే రోజున హడావుడిగా ఇటు జేడీయూ, అటు ఆర్జేడీ తమ ఎమ్మెల్యేలను పాట్నాకు పిలిపించాయి. నితీష్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం పాట్నాలోని రాజ్భవన్లో జరిగిన ‘ఎట్ హోం’ రిసెప్షన్లో పాల్గొన్నారు. ఏ నిమిషంలోనైనా నితీష్ కీలక ప్రకటన చేయనున్నారనీ, బీజేపీ, మాజీ సీఎం మాంజీరామ్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమనీ, కొత్త ప్రభుత్వంలో బీజేపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం నితీష్ జనవరి 28 నాటి అధికారిక కార్యక్రమాలన్నీ రద్దైనట్లు సీఎం కార్యాలయం ప్రకటించమూ ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.
ఈ వాదనకు బలాన్ని చేకూర్చుతూ.. అటు బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలతో శనివారం కీలక సమావేశం జరపనుంది. ఆదివారం (జనవరి 28)న నితీష్ ఏడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పాట్నా కేంద్రంగా వార్తలు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెల రోజుల్లో ఆయన అసెంబ్లీని రద్దు చేసి, ఎన్డీయే కూటమిలో చేరి ఏప్రిల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలతో బాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవటానికి నితీష్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే.. తరచూ రంగులు మార్చుతూ తమను మోసం చేస్తున్న తన మిత్రుడు నితీష్ కుమార్కు గట్టిగా ఝలక్ ఇచ్చేందుకు అటు లాలూ ప్రసాద్ యాదవ్ సిద్ధమవుతున్నారు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినా నితీష్ను సీఎం చేశామని, అయినా ఆయన పార్లమెంటు ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవటంపై లాలూ యాదవ్ మండిపడుతున్నారు.
ఇక.. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 79, కాంగ్రెస్కు 19, కమ్యునిస్టులకు 16 సీట్లున్నాయి. ఇవిగాక ఎంఐఎంకు ఒకరు, ఒక స్వతంత్ర సభ్యులున్నారు. అందరూ కలిస్తే.. 116 అవుతారు. కానీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 122 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. అటు.. బీజేపీకి 78, జేడీయూకి 45, మాజీ సీఎం మాంజీరామ్ పార్టీకి నాలుగు సీట్లు.. మొత్తం 127 అవుతాయి. దీంతో బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. నితీష్ సీఎం కావటానికి ఎలాంటి ఆటంకాలు లేనట్లేనని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.