Nitish Kumar Resignation : బిహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజభవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. రెండురోజులుగా బిహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. విపక్షాల కూటమి ఇండియాకు గుడ్ బై చెప్పి నితీష్ మళ్లీ ఎన్డీఏ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఆర్జీడీతో తెగదెంపులు చేసుకున్నారు. బీజేపీ కలిసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలోనే జేడీయూ ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం పట్నాలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రమే తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నితీష్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం సాయంత్రమే చేస్తారని తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు పట్నాలోని పార్టీ కార్యాలయంలో సమావేశమవుతున్నారు. ఎమ్మెల్యే మోతీలాల్ ప్రసాద్ కీలక అంశాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు నీతీష్ కుమార్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమకు బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అలాగే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేననని వ్యాఖ్యానించారు.
మరోవైపు జేడీయూ నేత నీరజ్ కుమార్ కూడా కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. వ్యూహాల వైఫల్యంపై సమీక్షించుకోవాలని కోరారు. మిత్రపక్షాలు ఎందుకు దూరమవుతున్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని స్పష్టంచేశారు.
బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. ఆర్జేడీ అతిపెద్ద పార్టీ. ఆ పార్టీకి 79 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల మద్దతు కావాలి. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇప్పటికే తాము కూడా సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా 43 మంది ఎమ్మెల్యేల సపోర్ట కావాలి. కాంగ్రెస్, వామపక్షాలతో కలిస్తే ఆ కూటమికి 114 మంది సభ్యుల మద్దతు ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 8 మంది సభ్యులు కావాలి. కానీ ఇది సాధ్యంకాదు కాబట్టి.. ఆర్జేడీకి అధికారం దక్కే అవకాశం లేదనే చెప్పాలి.
బీజేపీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాషాయ పార్టీ అసెంబ్లీ రెండో అతిపెద్ద పార్టీ. జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీయూ, బీజేపీ కలిస్తే ఈ కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య సరిపోతుంది. నలుగురు సభ్యులున్న హిందూస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. దీంతో ఈ కూటమి బలంగా 127కు చేరింది. అందువల్లే బీజేపీ మద్దతు ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్ కుమార్ కు ఎలాంటి ఢోకా ఉండదు.ఆర్జేడీ మంత్రుల స్థానంలో బీజేపీ సభ్యులకు కేబినెట్ లో ఛాన్స్ దక్కనుంది.
ఇదీ చదవండీ : ఊసరవెల్లి సిగ్గుపడేలా నితీష్ రాజకీయం..