Anti Paper Leak Bill: నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారం ఇటీవల దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రశ్నాపత్రం లీక్లకు అడ్డుకట్టవేయడంతో పాటు ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకల్ని నియంత్రించేందుకు బిహార్ అసెంబ్లీ కీలక బిల్లును బుధవారం ఆమోదించింది. బిహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024 ను రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల వాకౌట్ మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
నీట్-యూజీ పరీక్ష పశ్నాపత్రం లీక్, అక్రమాల ఆరోపణలపై చెలరేగిన వివాదానికి బిహార్ కేంద్ర బిందువుగా ఉంది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. ఆయా పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా విధిస్తారు.
నీట్ పేపర్ లీక్ విధానం..
ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్-యూజీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష రాసిన విద్యార్థుల్లో చాలా మంది విద్యార్థులకు 720, 720 మార్కులు రావడంతో వారిపై అనుమానాలు రేకెత్తాయి. అంతమందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కచ్చితంగా పేపర్ లీక్ అయి ఉంటుందని నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే రీ ఎగ్జామ్ అవసరం లేదంటూ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.
పేపర్ లీక్ అయిందన్న మాట వాస్తవమే కానీ పేపర్ లీకేజీ నిరూపించేందుకు తగిన సాక్ష్యాలు లేవని సుప్రీం కోర్టు వెల్లడించింది. పేపర్ లీక్ ద్వారా 150 మంది లబ్ధి పొందారని కాఫీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. పరీక్ష క్యాన్సల్ చేస్తే లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని, కాబట్టి మరోసారి నీటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది, నీట్ నిర్వహణలో లోపాలున్నాయని నీట్ పై అభ్యంతరాలను ఆగస్టు 21 లోగా వింటామని చెప్పుకొచ్చింది. దీంతో కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగనుంది.