Bihar : బిహార్లో తీవ్ర కలకలం రేపిన కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు ముమ్మరమైంది. అదనపు ఎస్పీ సారథ్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సారణ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు.
సారణ్ జిల్లా ఛాప్రా పట్టణంలో కల్తీ మద్యం మరణ మృదంగం మోగించింది. కల్తీ మద్యంతో ఆస్వస్థతకు గురై ఇప్పటి వరకు 65మంది చనిపోయారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు అమాయక ప్రజలు. కొంతమంది
ఆస్పత్రుల్లోనే చనిపోతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో నితీష్ సర్కార్ ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని సీఎం నితీష్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై సంబంధిత శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు.
గత 48గంటల్లో జరిపిన దాడుల్లో 126 మందిని అరెస్టు చేసి 4వేల లీటర్లకుపైగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే భయపడకుండా చెప్పాలని ప్రజలను కోరారు. బిహార్లో పూర్తి మద్యపాన నిషేదం కొనసాగుతోంది. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దొంగచాటుగా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అమాయక ప్రజలు అది తాగి మృత్యుఒడిలోకి చేరుతున్నారు.