Air India Express Flight Catches Fire : శనివారం బెంగళూరు నుంచి కొచ్చికి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టులోనే అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. విమానంలో మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఎవరికీ గాయాలు కాలేదని, 179 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రతినిధి పీటీఐతో మాట్లాడుతూ.. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకుండా, హాని జరగకుండా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారని తెలిపారు. వారంతా త్వరగా తమ గమ్యాలను చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. మే 18, 2024న.. బెంగుళూరు నుండి కొచ్చికి వెళ్తున్న IX 1132 విమానం 23.12 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానం బయల్దేరిన కొద్దినిమిషాలకే మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు.
సిబ్బంది అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయకపోయినా.. ల్యాండింగ్ ఫెయిలైనా పెనుప్రమాదం జరిగేదన్నారు. మంటలను గమనించిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించారు. అనంతరం పూర్తి స్థాయి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎమర్జెన్సీ ఫైర్ కంట్రోల్ టీమ్లు బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే మంటల్ని ఆర్పివేశాయి. ఇంజిన్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.