Driverless metro services : దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు బెంగళూరు చేరింది. చైనా నుంచి గత వారం ఈ రైలు చెన్నై పోర్టులో దిగుమతి అయింది. ఆరు బోగీలు ఉన్న ఈ మెట్రో రైలును బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీలో అసెంబుల్ చేస్తారు. చైనా ఇంజనీర్ల సమక్షంలో రైలు బిగింపు జరగనుంది.
నమ్మ మెట్రో ఎల్లో లైన్లోని జయదేవ ఆస్పత్రి, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీ మీదుగా ఆర్వీ రోడ్డును బొమ్మ సంద్రతో కలిపే 19.15 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు.
నమ్మ మెట్రోకు మొత్తం 216 కోచ్లను అందించేందుకు చైనా ప్రభుత్వానికి చెందిన సీఆర్ఆర్సీ నాన్జింగ్ పుజెన్ కంపెనీ లిమిటెడ్ 2019లోనే ఒప్పందం చేసుకుంది. దాని విలువ మొత్తం రూ.1578 కోట్లు.
లఖ్నవూకి చెందిన రిసెర్చి డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 32 పరీక్షలు నిర్వహిస్తామని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ మిలిటెడ్ తెలిపింది.
మే నాటికి రెండు రైళ్లు, ఆ తర్వాత ప్రతి నెలా రెండు రైళ్ల చొప్పున అందుతాయని భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో డ్రైవర్ రహిత మెట్రో రైలు బెంగళూరు వాసులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.