Rahul Gandhi got Bail in Defamation Case: పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ.. బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సివిల్ కోర్టు.. తాజాగా రాహుల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.
శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పరువునష్టం దావా కేసుపై విచారణ చేసిన కోర్టు.. రాహుల్ గాంధీకి ఊరటనిచ్చింది. ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ సైతం నిందితులుగా ఉన్నారు. వీరిద్దరికీ జూన్ 1నే బెయిల్ మంజూరైంది.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు.. వార్తాపత్రికల్లో కాంగ్రెస్ బీజేపీపై ఇచ్చిన ప్రకటనలను బీజేపీ తప్పుపట్టింది. నాటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తో పాటు.. బీజేపీ నేతలపై కాంగ్రెస్ ప్రధాన పత్రికలలో తప్పుడు ప్రకటనలు ఇచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. 2019-23 వరకూ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజా పనుల్లో 40 శాతం కమీషన్ తీసుకుంటుందని పేర్కొంటూ.. అవినీతి రేటు కార్డు పేరిట ప్రకటన చేసింది కాంగ్రెస్.
Also Read: రాహుల్ ఎటు వైపు మొగ్గు? సర్వత్రా ఆసక్తి..
తమకు పరువు భంగం కలిగేలా వార్తా పత్రికలలో ప్రకటనలు ప్రచురించారని, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పరువునష్టం కేసు వేసింది బీజేపీ. ఈ కేసు విచారణకై జూన్ 1న హాజరు కావాలని కోర్టు ఆదేశించగా.. సిద్ధరామయ్య, శివకుమార్ లు మాత్రమే హాజరయ్యారు. రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంతో.. ఆయనకు సీఆర్పీసీ 205 కింద మినహాయింపు ఇవ్వరాదన్నారు.
రాహుల్ గాంధీ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా బ్లాక్ సమావేశానికి హాజరవుతున్నారని, లోక్ సభ ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నందున మినహాయింపు ఇవ్వాలని కాంగ్రెస్ తరఫు న్యాయవాది కోరారు. దాంతో జూన్ 7న హాజరు కావాలని తెలిపింది.