Junior Doctors Protest: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జి కర్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై దారుణ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే వైద్యుల రక్షణకు సంబంధించి, ఈ కేసులో దర్యాప్తునకు సంబంధించి జూనియర్ డాక్టర్లు కోల్కతాలొ నిరసనలు చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీతో చర్చలకు, ఆ చర్చలు కూడా లైవ్ టెలికాస్ట్లో ప్రచురించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వారితో చర్చలకు బెంగాల్ ప్రభుత్వం అంగీకరించింది.
ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఈ చర్చలు మొదలు కావాల్సింది. కానీ, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు ఈ చర్చలకు హాజరు కాలేదు. వారి కోసం సీఎం మమతా బెనర్జీ సుమారు రెండు గంటలపాటు ఎదురుచూశారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. తనకు కూడా సీఎం పదవిలో కొనసాగాలని లేదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తాను సీఎంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాని వెల్లడించారు.
తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టి దష్ప్రచారం చేస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో రాజకీయ కుట్ర ఉన్నదని సాధారణ ప్రజలకు తెలిసే అవకాశం లేదని, ఇది తమ ప్రభుత్వానికి మరక తెస్తుందని తెలిపారు. ఈ కుట్ర వెనుక ఉన్నవారికి న్యాయం అవసరం లేదని, వారికి ఈ కుర్చీ కావాలని విమర్శించారు. వారి లక్ష్యం అదేనని, కానీ, న్యాయం కోసం పోరాడుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారని ఆరోపించారు.
‘ప్రజల ప్రయోజనాల కోసం తాను ఈ పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమే. నాకు ఈ సీఎం పోస్టు అక్కర్లేదు. తిలోత్తమకు న్యాయం జరగడమే నాకూ కావాలి. అలాగే.. సాధారణ ప్రజలు వైద్య చికిత్స పొందాలి’ అని జూనియర్ డాక్టర్ల కోసం ఎదురుచూసి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. వైద్యుల ప్రతినిధుల బృందం సెక్రెటేరియట్ గేటు దాకా వచ్చారు. కానీ, ఆ చర్చలు లైవ్ టెలికాస్ట్ కావడం లేదని తెలిసి వెనక్కి తిరిగి వెళ్లారు. లైవ్ టెలికాస్ట్ కోసం పట్టుబట్టారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని, కాబట్టి, తాము ఈ చర్చలను లైవ్ టెలికాస్ట్ చేయలేమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అంతకు ముందే సీఎస్ వారికి తెలియజేశారు.
Also Read: Sitaram Yechury: ఇందిరా గాంధీతో రాజీనామా చేయించిన సీతారాం ఏచూరి.. మరిన్ని ఆసక్తికర విషయాలివే!
లైవ్ టెలికాస్ట్ పెట్టబోమని, కానీ, ఆ చర్చలను పూర్తిగా వీడియో రికార్డ్ చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడే ప్రెస్ కూడా ఉంటుందని వివరించారు. కానీ, ఆ జూనియర్ డాక్టర్లు మాత్రం లైవ్ టెలికాస్ట్ కావాల్సిందేనని పట్టుబట్టారు. ఈ డిమాండ్ అమలు చేయడం లేదనే కారణంగా వైద్య బృందం వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. వారి కోసం సుమారు రెండు గంటలపాటు సెక్రెటేరియట్లో మీటింగ్ హాల్లో సీఎం మమతా బెనర్జీ వెయిట్ చేశారు. రాకపోవడంతో అక్కడే మీడియాతో మాట్లాడారు. అయినా.. ఆమె వారిని కోపగించుకోలేదు. వారు చిన్నవాళ్లని, పెద్దవాళ్లే సర్దుకుపోవాలని పేర్కొన్నారు. వారు చర్చలకు వస్తే బాగుండేదని, సాధారణ ప్రజలు చికిత్స కోసం ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్ల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. ఇవాళ ఈ సమస్య ముగిసిపోతుందని ఎదురుచూసిన వారందరికీ తాను క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు.