History of Bastar Dussehra: దేశమంతా తొమ్మిది రోజులు జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలు.. అక్కడ పూర్తిగా డిఫరెంట్.. అదే చత్తీస్ఘడ్ లోని జగదల్పూర్. దసరా 75 రోజులు జరుగుతుంది. వామ్మో అన్ని రోజులా? అనుకుంటున్నారా? అంతేకాదు అక్కడి దసరాకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. అక్కడి సెలెబ్రేషన్కు తెలంగాణలోని వరంగల్కు సంబంధం కూడా ఉంది.. ఇంకెందుకు ఆలస్యం ఆ టెంపుల్ విశేషాలు మీరు కూడా ఓసారి చూసేయండి.
జగదల్పూర్లో జరిగే దసరా ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ దసరా ఉత్సవాలు 75 రోజులు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 4న ప్రారంభమైన దసరా ఉత్సవాలు ఈరోజుతో మూగియనున్నాయి. ఇక్కడ దసరా ఉత్సవాలను ప్రారంభించాలంటే.. పదేళ్ల బాలిక అనుమతి అవసరం. ఆ బాలికను అమ్మవారు పూనుకొని ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం. పదేళ్ల లోపు గిరిజన బాలికను ఊయలకు కట్టిన ముళ్ళ పాన్పుపై పడుకోపెట్టి.. పూజలు చేసి.. బస్టర్ రాజ వంశీయులు అనుమతి కోరుతారు. అమ్మవారు పూనిన ఆ బాలిక అనుమతిచ్చే వరకు రాజ వంశీయులు వేడుకుంటారు. అనుమతి దొరికిన వెంటనే 9 రోజుల దసరా నవ రాత్రులను ప్రారంభిస్తారు. 1772లో కట్టిన ఈ ఆలయంలో ఆనాటి నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. జగదల్పూర్లో అప్పటి ఆలయం, పదేళ్ల బాలికను పడుకోబెట్టిన ముళ్ళ పాన్పు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
జగదల్పూర్లో ఉన్న దుర్గాదేవికి తెలంగాణలోని వరంగల్కు ఎంతో సంబంధం ఉంది. 1313 సంవత్సరంలో వరంగల్ నుంచి అమ్మవారి ప్రతిమను జగదల్పూర్కు తీసుకువస్తుండగా.. మార్గమధ్యంలో దంతేవాడ సమీపాన చిన్న శబ్దం వచ్చింది. అప్పుడు అమ్మవారితో వస్తున్న వాళ్లంతా వెనుదిరిగి చూడగా.. అమ్మవారు దంతేవాడలోనే శక్తి పీఠంగా అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. దంతేవాడ నుంచి అమ్మవారి ప్రతిమను తెచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దసరా ఉత్సవాలు పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభించిన రోజు నుంచి దేవీ నవరాత్రులు పూర్తయ్యే వరకు జరుగుతాయి. అంటే 75 రోజులు పాటు నిర్విరామంగా జరుగుతాయన్నమాట. ఈ ఏడాది ఆగస్టు 4న ప్రారంభమైన దసరా ఉత్సవాలు నేటి రాత్రి జరిగే ఉత్సవంతో ముగుస్తాయి.
Also Read: హరియాణా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం… హాజరైన మోదీ, షా, చంద్రబాబు
జగదల్పూర్ దసరా(Bastar Dussehra) ఉత్సవాల్లో రథోత్సవం చాలా కీలకం. ఇందు కోసం ప్రతి ఏటా ఓ కొత్త రథాన్ని తయారు చేస్తారు. ఆ కొత్త రథంలో అమ్మవారిని ఊరేగించి మళ్లీ సంవత్సరం దసరా ఉత్సవాల్లో 8 రోజులపాటు అమ్మవారి ఊరేగింపు జరుపుతారు. ఆతరువాత మళ్లీ కొత్త రథం సిద్ధం చేసి రథోత్సవం చేస్తారు. రథోత్సవం చేసిన రాత్రి ఆరథాన్ని దొంగిలించి ఒకచోట ఉంచుతారు. బస్టర్ రాజులు ఆ దొంగలతో చర్చించి.. వాళ్లకు విందు ఇచ్చి రథాన్ని, అమ్మవారిని తిరిగి తీసుకొస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఆనవాయితీ.
ఓస్ ఇంతేనా అనుకుంటున్నారా? అంతే కాదండోయ్.. జగదల్పూర్(jagdalpur) అమ్మవారి ఆలయంలో నిర్విరామంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా దసరా ఉత్సవాలు జరగాలని గోండు, గిరిజన తెగలకు చెందిన యువకుడు తొమ్మిది రోజులు పాటు భోజనం చేయకుండా, మంచినీళ్లు కూడా ముట్టకుండా వచ్చిన భక్తులకు ఆశీర్వచనాలు ఇస్తారు. అమ్మవారిని దర్శించుకునే ప్రతీ భక్తుడు ఇక్కడకొచ్చి ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. ప్రస్తుతం జగదల్పూర్లో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో సిద్ధం చేస్తున్న కొత్త రథం, తొమ్మిది రోజులపాటు అన్న, పానీయాలు తీసుకోకుండా భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చే యువకుడి మందిరం, అక్కడి విశేషాలూ చూద్దామా?
చూశారుగా.. మన దేశంలోనే మరో ప్రపంచంలా ఉన్న దసరా సెలబ్రేషన్స్ .. ఇదీ చత్తీస్ఘడ్లోని జగదల్పూర్లో దసరా సంబరాల విశేషాలు, ప్రత్యేకతలు. బిగ్ టీవీ ప్రత్యేకంగా మీకందించిన దసరా కానుక.