Shirdi : శిర్డీ సాయిబాబా ఆలయ భద్రత విషయంలో వివాదం రేగింది. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలన్న నిర్ణయాన్ని శిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. మే 1 నుంచి నిరవధిక బంద్ పిలుపునిచ్చారు. శిర్డీ ఆలయానికి మరింత భద్రత పెంచాలని సాయి సంస్థాన్ ట్రస్టు పెద్దలు, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రతను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం శిర్డీ సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది చూస్తున్నారు. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఆలయంలో ప్రతి రోజూ బాంబు స్క్వాడ్ తనిఖీ చేపడుతుంది. 2018లో సామాజిక కార్యకర్త సంజయ్ కాలే బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్లో ఆలయ భద్రతపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఔరంగాబాద్ బెంచ్ విచారణ చేపట్టింది. ఆలయ భద్రతపై సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది.
సీఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ అంగీకారం తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్నే శిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. గురువారం శిర్డీలో అఖిలపక్ష నాయకులు, గ్రామస్థుల సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర దినోత్సవం రోజు నుంచి అంటే మే 1 నుంచి ఆందోళన చేయాలని నిర్ణయించారు.
సాయిబాబా ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత వద్దని శిర్డీ గ్రామస్తులు అంటున్నారు. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఏర్పాటు చేయాలంటున్నారు. శిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ బోర్డులో 50 శాతం ధర్మకర్తలు శిర్డీ గ్రామస్తులే ఉండాలని పట్టుబడుతున్నారు.
శిర్డీ గ్రామస్థులు నిరసనకు దిగినా భక్తుల కోసం సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది. సాయిబాబా సంస్థాన్లో భక్తులు బస చేసే అవకాశం ఉంటుంది. సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్ యథావిధిగా నిర్వహిస్తారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కొనసాగుతాయి. ఇతర అన్ని వ్యాపారాలను మాత్రం పూర్తిగా మూసివేస్తారు.