Baba Siddique: ముంబై రాజకీయాల్లో ప్రముఖుడు, బాలీవుడ్ హీరోలకు ఆప్తుడు బాబా సిద్దిఖ్ (66) శనివారం అక్టోబర్ 13, 2024 రాత్రి మరణించారు. బాంద్రో ఈస్ట్ ప్రాంతంలో తన కుమారుడు ఆఫీసు నుంచి రాత్రి 9.30 బయటికి వస్తున్న ఆయనపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ ఉన్నట్లు సమాచారం.
బాబా సిద్దిఖ్ పూర్తి పేరు జియాఉద్దీన్ సిద్దిఖ్. ఆయన 1977లో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ముంబై రాజకీయ నాయకులలో తనకంటూ అనతికాలంలో ఆయన పేరు సంపాదించారు. 1999లో ఆయన బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికల్లో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఆయన మూడు సార్లు గెలిచారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర మంత్రిగా ఆయన పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్య స్వభావం ఉన్న సిద్దిఖ్.. హిందూ, ముస్లింల ఐక్యతను ప్రోత్సహించేవారు.
రాజకీయాలతో పాటు బాబా సిద్దిఖ్ పేరు రంజాన్ నెలలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలకు ఫేమస్. ప్రతీ సంవత్సరం రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ స్టార్ హీరోలకు ఆయన ఇఫ్తార్ పార్టీకి ఆహ్వానించేవారు. ముఖ్యంగా 2013లో ఆయన ఇఫ్తార్ పార్టీలో బాలీవుడ్ టాప్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇద్దరూ విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటివరకు షారుఖ్, సల్మాన్ మధ్య శత్రుత్వం ఉండేది. సిద్దిఖ్ ఇద్దరు స్టార్ హీరోలను తన ఇఫ్తార్ విందుకు ఆహ్వానించి పవిత్ర రంజాన్ మాసంలో కలిపారు. అలా ఇద్దరు స్టార్ హీరోలు మళ్లీ స్నేహితులుగా మారి కౌగిలించుకున్నారు.
బాబా సిద్దిఖ్ చాలా మృదుస్వభావం కలవారని అందరితో చాలా మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా మెలిగేవారని ఆయన ఇరుగుపొరుగువారు, రాజకీయ నాయకులు తెలిపారు. బాబా సిద్దిఖ్ పై కాల్పులు జరిగాయని తెలియగానే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి ప్రముఖ స్టార్ హీరోలు వెంటనే లీలావతి ఆస్పత్రికి పరుగు పరుగున వచ్చారని జాతీయ మీడియా తెలిపింది.
Also Read: ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ దారుణ హత్య, మూడు రౌండ్లు కాల్పులు.. హత్య ఎవరి పని?
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన బాబా సిద్దిఖ్ కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ ను వీడి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముంబై రాజకీయాలు అలజడి రేగింది. తాను వ్యక్తిగత కారణాల వల్లే కాంగ్రెస్ పార్టీని నుంచి బయటికి వచ్చానని ఆయన చెప్పారు. ఏ రాజకీయ నాయకులపైన ఆయన విమర్శలు చేయలేదు. అయితే ఆయన తన జీవితంలో ఒక స్లమ్ బస్తీ రిహబిలిటేషన్ ప్రాజెక్ట్ చేపట్టి విమర్శలు ఎదుర్కొన్నారు.
బాబా సిద్ధిఖ్ మరణంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. బాబా సిద్దిఖ్ హత్య కేసులో ఉన్నత స్థాయి అధికారులతో వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రంలో హింసాత్మక ఘటనల సంఖ్య పెరిగిపోతోందని రాహుల్ గాంధీ అన్నారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. సిద్దిఖ్ హత్యను ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య పెరిపోతోందని అన్నారు. సిద్దిఖ్ హత్య గురించి తెలుసుకున్న వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ తన ఎన్నికల ర్యాలీని రద్దు చేసుకున్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేదీ బాబా సిద్దిఖ్ కుటుంబాన్ని పరామర్చించి.. హత్య కేసులో వెంటనే విచారణ చేపట్టాలని చెప్పారు. బాబా సిద్ధిఖ్ మరణంతో ఇటు ముంబై రాజకీయాలకు అటు బాలీవుడ్ కు తీరని నష్టం జరిగింది.