Ayodhya: హిందువులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య రాముడిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఆరాటపడుతున్నారు. అయోధ్యలో రామాలయం. పోరాడి సాధించుకున్న ఆలయం. నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 1800 కోట్ల ఖర్చుతో.. 3 అంతస్తుల్లో, 5 మండపాలుగా ఆలయాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే 50 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. హిందువులంతా గర్వపడేలా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఆ డిజైన్లు.. సుందర శిల్పాలు.. పచ్చదనం.. అంతా అద్భుతం.
ఇంతకీ, ఆ అయోధ్య రాముడి దేవాలయాన్ని ఎప్పుడు ఆరంభిస్తారు? రాములోరి దర్శన భాగ్యం ఎప్పటి నుంచి కలుగుతుంది? అనే ఉత్కంఠకు తెరదించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆలయ నిర్మాణం పూర్తయ్యే సమయం వెల్లడించారు.
వచ్చే ఏడాది జనవరి 1నాటికి ఆలయం సిద్ధమవుతుందని అమిత్ షా ప్రకటించారు. త్రిపుర పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి గురువారం ఓ సభలో ప్రసంగిస్తూ.. “రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్.. కోర్టుల్లో నాన్చింది. కానీ, సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ పనులను ప్రారంభించారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 1 నాటికి ఆలయం సిద్ధమువుతుంది” అని అమిత్ షా చెప్పారు. అంటే, నెక్ట్స్ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి భక్తులను అనుమతిస్తారని తెలుస్తోంది.