Ayodhya Ram Mandir (telugu news updates) : ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 100 కోట్ల మంది హిందువుల కళ అయిన అయోధ్య రామాలయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్తర కార్యక్రమాన్ని చూసి యావత్తు భారతదేశం భక్తి పరవసంతో పులకించిపోయింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్యకు రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంటుంది. ఈ తరుణంలో అయోధ్య రామాలయం మరో ఉత్సవానికి ముస్తాబు కాబోతోంది. బాలరాముడి పుట్టినరోజున అయోధ్యలో మరోసారి భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వించనున్నారు.
అయోధ్య రామాలయంలో మరికొద్ది రోజుల్లో మరో ఉత్సవం జరగనుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఇక్కడ జరిగే తొలి కార్యక్రమం ఇదే కావడంతో భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్యలో బాలరాముని పుట్టినరోజును ఏప్రిల్ 17న మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. బాలరాముడి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థం ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటినుంచే ఏర్పాట్లు మొదలుపెట్టింది.
Also Read: Election Schedule Today : నేడే ఎన్నికల షెడ్యూల్.. మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రకటన
ప్రస్తుతం అయోధ్య రామాలయం తలుపులు సాధారణ భక్తుల దర్శనం కొరకు ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటాయి. అయితే ఆ బాలక్ రామ్ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని మూడు రోజుల పాటు దర్శన సమయాన్ని పెంచనున్నారు. ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అయోధ్య బాలరాముడ్ని లక్షల్లో భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలనుంచి ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. కొన్ని విమానయాన సంస్థలు సైతం దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలను నడుపుతున్నాయి.