Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామాలయాన్ని 5 శతాబ్దాల నాడు బాబర్ సేనలు నాశనం చేసి.. దానిపై మసీదు నిర్మించిన రోజు.. అక్కడి సూర్యవంశ క్షత్రియులంతా ఓ ప్రతిజ్ఞ చేశారట. తిరిగి అదేచోట రామమందిరం కట్టేవరకూ చెప్పులు, పాదరక్షలు, గొడుగు ధరించరాదని వారు నిర్ణయించారు. ఇన్నేళ్ల పాటు.. వారు తమ వివాహ సమయంలోనూ చెప్పులు, తలపాగా, గొడుగు ధరించటానికి దూరంగా ఉంటూ వచ్చారు. జనవరి 22న తమ వంశీయుడైన రామయ్య గుడి ప్రతిష్ఠ సందర్భంగా క్షత్రియ సమాజం వారు 1.5 లక్షల మంది సూర్యవంశ క్షత్రియులకు చెప్పులు, తలపాగాలు, గొడుగులు సిద్ధం చేసి, గ్రామగ్రామాన వారికి నేరుగా అందిస్తున్నారు.
అయోధ్య రామమందిర ప్రారంభవేళ.. పది రోజుల ముందే రామయ్యకు అత్తవారింటి నుంచి బహుమతులు అయోధ్యకు చేరాయి. సీతాదేవి జన్మస్థలమైన నేపాల్లోని జనకపూర్ ధామ్ నుంచి 36 వాహనాల్లో ఊరేగింపుగా బయలుదేరిన 3 వేలకు పైగా భక్తులు వెండి, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలతో బాటు వెయ్యి బుట్టల్లో డ్రైఫ్రూట్స్, మిఠాయిలు తీసుకుని జనవరి 6న ఆలయ ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు.
రామయ్య విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఉత్తర ప్రదేశ్ జైళ్లలోని ఖైదీలందరూ వీక్షించనున్నారు. దీనికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జైళ్లలో పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఆరోజున ఖైదీలకు ప్రత్యేక భోజనాన్ని కూడా అందించనుంది. జైళ్లలో రామచరిత మానస్ పారాయణ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బస్సులో జనవరి 22 వరకు నిరంతర రామనామం వినిపించేలా స్పీకర్లు ఏర్పాట్లు చేశారు.
అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ప్రాంగణానికి కాస్త దూరంలో.. ఒక పెద్ద పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇందులో 25వేల మంది పర్యాటకులు తమ లగేజీ పెట్టుకునే లాకర్ సౌకర్యం, చిన్న ఆసుపత్రి, స్నానాల గదులు, టాయిలెట్స్ కూడిన ఓ భారీ కాంప్లెక్స్, వేస్ట్ మెటీరియల్ రీసైక్లింగ్ సెంటర్ నిర్మించారు.
అయోధ్య ఆలయంలో 2400 కేజీల బరువున్న భారీ గంటను ఏర్పాటు చేశారు. రూ.24 లక్షల వ్యయంతో తయారైన ఈ గంట 8 లోహాలతో తయారైంది. 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు గల దీని ఘంటానాదం 2 కి.మీ వరకు వినిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద గంటగా ఇది గుర్తింపు పొందింది. రామయ్య ప్రతిష్ఠ తర్వాత 108 అడుగుల పొడవైన అరగొత్తులు వెలిగిస్తారు. ధూపం కర్ర, పంచగవ్య, హవనద్రవ్యాలు, గోఉత్పత్తులతో వీటిని తయారుచేశారు.
నేపాల్లోని నారాయణి నది నుండి సాలిగ్రామ శిలతో రూపొందించిన రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రధాని మోదీ తొలి హారతిని ఇవ్వబోతున్నారు. దీనికోసం.. జోథ్పూర్ నుంచి 108 వాహనాల్లో 6 క్వింటాళ్ల దేశీ ఆవు నెయ్యి, హవన ద్రవ్యాలను అయోధ్యకు తీసుకువచ్చారు.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దేశ విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ముఖ్యంగా.. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే అన్ని దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.
అయోధ్య రామమందిర ప్రతిష్ఠ జరగనున్న వేళ.. లక్నో ముస్లింలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22న లక్నోలో మాంసం దుకాణాలను మూసివేయాలని అక్కడి ఆల్ ఇండియా జమియాతుల్ ఖురేష్ నిర్ణయించింది.
జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవానికి ముందే అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలు కావటంతో విమాన టిక్కెట్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్ విమానాల టికెట్ ధర రూ. రూ. 10,987గా ఉండగా, అదేరోజు ముంబయి- అయోధ్య విమానం టిక్కెట్టు ధర.. ఇండిగో విమానానికి రూ. 20,700గా ఉండగా, జనవరి 20కి ఇదే విమానపు టిక్కెట్టు రూ.20 వేలు చూపుతోంది.
జనవరి 22న జరిగే అయోధ్య రామాలయ ప్రతిష్ఠకు ఆహ్వాన పత్రం, డ్యూటీ పాస్ ఉన్నవారినే అనుమతిస్తారు. ఆహ్వానితులంతా సంప్రదాయ వేషధారణలో రావాలి. సాధువులు సైతం.. తమ దండ,కమండాలను తీసుకెళ్లే అవకాశం లేదు.