అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట ముగిసింది. ప్రత్యేక పూజల తర్వాత రామ్లల్లా భక్తులకు దర్శనమిస్తున్నాడు. రాముడి దర్శనం చేసుకున్న వీఐపీలు పరవశంతో పులకించిపోయారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని యావత్ దేశం ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంది.
మన రాముడొచ్చేశాడు. అవును అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో.. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆ మాహోజ్వల ఘట్టం చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. దేశ విదేశీ ప్రముఖుల నడుమ వైభవోపేతంగా ప్రాణప్రతిష్ట జరిగింది. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య మార్మోగింది.
12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లఘ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ క్రతువు 84 సెకన్ల పాటు సాగింది. విగ్రహం కళ్లకు అడ్డుగా ఉన్న వస్త్రాన్ని తొలగించిన ప్రధాని మోడీ.. రామ్ లల్లాకు తొలి హారతి ఇచ్చారు. ఆ తర్వాత 51 అంగుళాల విగ్రహం రూపంలో బాల రాముడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
అంతకుముందు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట క్రతువును ప్రధాని మోడీ ప్రారంభించారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించిన అనంతరం క్రతువులో పాల్గొన్నారు. ఇందులో ప్రధాని మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువును ప్రారంభించి.. అనుకున్న సమయానికి ముగించారు.
పూజా క్రతువు నిర్వహించిన పూజారులకు కానుకలు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మోడీకి బంగారు ఉంగరాన్ని తొడిగి దీవించారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగియడంతో ఆలయ ప్రాంగణం అంతా జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది. ఆలయంపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.
ప్రధాని మోడీ మరోసారి తన నిర్మలమైన మనసును చాటుకున్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణంలో భాగం పంచుకున్న కార్మికులు, సిబ్బందికి అరుదైన గౌరవం దక్కింది. వారి శ్రమను ప్రధాని మోడీ ప్రశసించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తైన తర్వాత కార్మికులపై పువ్వులు చల్లుతూ అభినందించారు. వారందరినీ పలకరిస్తూ నమస్కారం చేశారు.
ప్రాణప్రతిష్ట ముగియడంతో ప్రధాని మోడీ చేపట్టిన 11 రోజుల ఉపవాస దీక్ష విరమించారు. గోవింద్ దేవ్ మహరాజ్ పండితులు తీర్థం తాగించి దీక్ష విరమింపజేశారు. జనవరి 12 నుంచి ప్రధాని దీక్ష చేపట్టి సాత్విక ఆహారం తీసుకుంటూ కఠిన తపస్సు చేశారు.
బాలరాముడి ప్రాణ ప్రతిష్టను కళ్లరా వీక్షించేందుకు ప్రముఖులు అయోధ్యలో ఉదయమే అక్కడికి చేరుకున్నారు. వారిలో బిగ్బీ ఫ్యామిలీ, చిరంజీవి కుటుంబం, పవన్ కల్యాన్, చంద్రబాబు, బాలీవుడ్ నటులు రణ్బీర్-ఆలియా దంపతులు, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ దంపతులు, జాకీ ష్రాఫ్, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, రామ్దేవ్ బాబా, క్రికెటర్ అనిల్ కుంబ్లే, రజినీకాంత్, అనుపమ్ ఖేర్, క్రీడాకారులు మిథాలీ రాజ్, సైనా నెహ్వాల్, చినజీయర్ స్వామి ఉన్నారు. ఇక ప్రత్యేకించి నటి కంగనా రనౌత్ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట పూర్తైన తర్వాత పూల వర్షం కురుస్తుంటే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
.
.