Ayodhya Ram Mandir : అయోధ్యలో రామయ్య కొలువుదీరే అపురూప క్షణాలు ఆసన్నమయ్యాయి. మరికొద్ది నిమిషాల్లో ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
వేద మంత్రోచ్చారణ మధ్య రామ్ లల్లా విగ్రహానికి జరిగే ప్రాణ ప్రతిష్ఠకు ఆగమశాస్త్రంలో విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణశక్తి.. ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం అని అర్థం.
అప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణించగా.. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన క్షణం నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుందని ఆగమశాస్త్రం చెబుతున్నాయి.
మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరగనుంది. ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ సమయంలోనే.. విగ్రహ కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని తొలగిస్తారు.
బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దుతారు. రామ్లల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు. ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది.