Aviation : మన దేశంలో ప్రధాన ప్రయాణ సదుపాయం రైల్వేలే. అత్యధికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. లేదంటేరోడ్డు మార్గం పడతారు. విమానయానం చేసేది అతి కొద్ది మందే. దేశ జనాభాలో ప్రతి 20 మందికి ఒక్కరు మాత్రమే ఫ్లయిట్లో ప్రయాణిస్తున్నారు. భారతీయుల్లో అత్యధిక సంఖ్యాకులకు విమానయానం అనేది ఆర్థికంగా వెసులుబాటు కాకపోవడమే ఇందుకు కారణం.
దేశజనాభాలో 3% మాత్రమే తరచూ విమానాల్లో ప్రయాణిస్తుంటారు. అంటే 140 కోట్ల జనాభాలో 4.2 కోట్ల మంది కి విమానయానం అందుబాటులో ఉంది. అలా ప్రయాణించే వారిలో అత్యధికులు ఎగ్జిక్యూటివ్లు, విద్యార్థులు, ఇంజనీర్లే. సమయం వారికి ఎంతో విలువైనందున.. స్వల్ప వ్యవధిలో గమ్యస్థానానికి చేరే లక్ష్యంతో వారంతా ఎయిర్ ట్రావెల్కు
మొగ్గు చూపడం సహజం. ఇలా పరిమిత సంఖ్యలో ప్రయాణికులు, నష్టాలు వంటి పరిమితులెన్నో ఉన్నా.. మన దేశం మాత్రం ఏవియేషన్ రంగంపై వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది. ప్రపంచంలో ఏ దేశమూ సాహసించనంత సంఖ్యలో
విమానాలను కొనుగోలు చేస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే వెయ్యి విమానాలకు ఆర్డర్ పెట్టడమంటే మాటలు కాదు. ఇంత పెద్దఎత్తున ఫ్లయిట్ల కొనుగోలుకు సిద్ధపడటం వెనుక కారణాలు లేకపోలేదు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల సంఖ్య వచ్చే ఏడాది 109 మిలియన్లు దాటిపోతుందని
అంచనా. ఆ మైలురాయిని చేరుకుంటే ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయంగా రికార్డుల్లోకి ఎక్కుతుంది. 2012లో ఈ ఎయిర్పోర్టు నుంచి 30 మిలియన్ల మంది ప్రయాణించారు. అమెరికా అట్లాంటాలోని హార్ట్స్ఫీల్డ్-జాక్సన్ ఎయిర్పోర్టు అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో అగ్రభాగాన ఉంది.
పెరుగుతున్న రద్దీ కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టుపై ప్రభుత్వం వేల కోట్లు పెట్టుబడిగా పెడుతోంది. ఐదు నెలల క్రితమే నాలుగో రన్వేతో పాటు ఎలివేటెడ్ టాక్సీవేను ప్రారంభించారు. ఇక గంటకు ఆరువేల బ్యాగ్లను సార్టింగ్ చేయగల ఆటోమేటెడ్ లగేజ్-హ్యాండ్లింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ-ముంబై ఎయిర్ కారిడార్ ప్రపంచ రద్దీ రూట్లలో పదో స్థానంలో ఉంది.
రానున్న 2, 3 ఏళ్లలో ఏవియేషన్ రంగం మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోగలిగితే విమానయానరంగానికి మరింత ఊపు వస్తుంది. అందుకు తగ్గట్టుగానే కేంద్రం ఎయిర్పోర్టుల నిర్మాణం, విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మోదీ సర్కారు పగ్గాలు చేపట్టే నాటికి 74 ఎయిర్ పోర్టులు ఉండగా.. ఇప్పుడు 148కి చేరాయి. రానున్న ఏడేళ్లలో ఈ సంఖ్యను 230కి చేర్చాలని సంకల్పిస్తోంది.
ఈ రంగం పురోభివృద్ధికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో విమానాల కొనుగోలుకూ ఏవియేషన్ సంస్థలు వెనకాడటం లేదు. అమెరికాకు చెందిన బోయింగ్, యూరప్కు చెందిన ఎయిర్ బస్ విమాన తయారీ కంపెనీలే భారత ఆర్డర్లను దక్కించుకున్నాయి. టాటా గ్రూప్ టేకోవర్ చేసిన ఎయిరిండియా.. ఎయిర్ బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 విమానాలను కొనేందుకు ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి మొత్తం విలువ 70 బిలియన్ డాలర్లు. అలాగే ఇండిగో సంస్థ ఎయిర్బస్ నుంచి 500 విమానాల కొనుగోలు చేయాలని జూన్ నెలలో నిర్ణయం తీసుకుంది.