Karnataka Election News(Telugu news updates): ఎన్నికలంటేనే హైటెన్షన్. ఓటింగ్ సరళిపై పార్టీల్లో టెన్షన్. శాంతిభద్రతలపై పోలీసుల్లో టెన్షన్. ఈవీఎంల పనితీరుపై అధికారుల్లో టెన్షన్. ఇలా టెన్షన్ టెన్షన్గా సాగే ఎన్నికల్లో.. మరింత ఉద్రిక్తత రాజుకుంది. ఓ పుకారు.. ఆ గ్రామాన్ని రణరంగంగా మార్చేసింది. అనేకమందిని కేసుల్లో చిక్కుకునేలా చేసింది.
కర్నాటకలోని విజయపుర జిల్లా మసబినళ గ్రామం. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. అంతలోనే ముగ్గురు పోలింగ్ సిబ్బంది.. రెండు ఈవీఎంలను కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లి కారులో పెడుతున్నారు. అది చూసిన గ్రామస్తులు.. ఈవీఎం మెషిన్ను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఆ ప్రశ్నను తట్టుకోలేని ఎన్నికల అధికారి.. కాస్త దురుసుగా సమాధానం చెప్పాడు. అదంతా మీకెందుకు.. మీ పని మీరు చూసుకోండి.. అంటూ జవాబిచ్చాడు. అంతే. ఇక పరిస్థితి చేజారిపోయింది.
ఎన్నికల అధికారులు ఓటింగ్ నిలిపేశారని.. ఈవీఎంలను తారుమారు చేస్తున్నారని.. చాటుగా ఓట్లు తరలిస్తున్నారంటూ గ్రామస్తులు భావించారు. అంతాకలిసి అధికారులపై దాడి చేశారు. అక్కడితో ఆగలేదు.. కారులో పెడుతున్న ఈవీఎంలను, వీవీప్యాట్లను పగలగొట్టారు. వాటిని నేలకేసి కొట్టి ముక్కలు ముక్కలు చేశారు. కారును ధ్వంసం చేశారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. గ్రామస్తుల దాడిలో ఎన్నికల అధికారికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై ఈసీ ఉన్నతాధికారి స్పందించారు. పోలింగ్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. అవి అదనంగా ఉన్న ఈవీఎంలు మాత్రమేనని.. వాటి అవసరం లేకపోవడంతో మరో పోలింగ్ కేంద్రానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ఈ ఘటనలో 23 మందిని పోలీసులు అరెస్టు చేసి.. వారిపై కేసులు నమోదు చేశారు.