Attack On BJP MP Candidate in West Bengal: పశ్చిమ బెంగాల్లోని జార్గ్రామ్ లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రణత్ తుడుపై పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో శనివారం దాడి జరిగింది.
పీటీఐ నివేదిక ప్రకారం, కొన్ని పోలింగ్ బూత్లలో బీజేపీ పోలింగ్ ఏజెంట్లు ఎదుర్కొంటున్న అసౌకర్యాల గురించి విన్న ప్రణత్ తుడు గర్బెటా ప్రాంతం వైపు వెళుతుండగా, దుండగులు అతనిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది.
“అకస్మాత్తుగా, రోడ్లను దిగ్బంధించిన TMC గూండాలు నా కారుపై ఇటుకలను విసిరారు. నా భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు గాయపడ్డారు. నాతో పాటు వస్తున్న ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు తలకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది” అని ప్రణత్ తుడు తెలిపారు.
“కేంద్ర బలగాలు అక్కడ ఉండకపోతే మేము బ్రతికేవాళ్లం కాదు.. మాకు స్థానిక పోలీసుల నుంచి ఎటువంటి రక్షణ లభించలేదు.. CAAని విధించండం దీదీకి ఇష్టం లేదు.. దేశాన్ని పాకిస్తాన్గా మార్చడం దీదీకి ఇష్టం” అని ఆయన ఆరోపించారు.
అయితే, తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది, “బీజేపీ అభ్యర్థి ఓటర్లను బెదిరిస్తున్నారు. క్యూ లైన్లో నిల్చున్న మహిళపై ప్రణత్ తుడు సెక్యురిటీ గార్డు దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు నిరసనకు దిగారు.” అని పేర్కొంది.
షెడ్యూల్డ్ తెగల రిజర్వ్డ్ లోక్సభ స్థానమైన జార్గ్రామ్లో టీఎంసీ నుంచి కాలిపడా సోరెన్పై ప్రణత్ తుడు పోరాడుతున్నారు. 2019లో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది, అయితే 2021లో జార్గ్రామ్లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో TMC పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది.
Also Read: ముగిసిన పార్లమెంటు ఆరో దశ ఎన్నికల పోలింగ్
పశ్చిమ బెంగాల్లోని 42 లోక్సభ స్థానాలకు గానూ శనివారం పోలింగ్ జరగనున్న ఎనిమిది స్థానాల్లో జార్గ్రామ్ కూడా ఉంది.