Attack in Parliament: దేశమంతా మరొక్కసారి ఉలిక్కిపడేలా చేసింది పార్లమెంట్ పై దాడి ఘటన. 22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై జరిగిన దాడిని మరువక ముందే.. సరిగ్గా మళ్ళీ అదే రోజున.. నిండు సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడడం అందర్నీ షాక్ కి గురయ్యేలా చేస్తుంది. ఇక హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగినట్టు పోలీసులు తేల్చారు. ఈ దాడికి సంబంధించి నలుగురు కాదు.. మొత్తం ఆరుగురి హస్తం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు.
సాగర్ శర్మ, మనోరంజన్, నీలమ్, అమోల్ షిండే, విక్కీ శర్మ, లలిత్ అనే ఆరుగురు ఈ ఘటనకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆరుగురు నిందితులు ఒకేసారి పార్లమెంటు లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకోగా.. ఇద్దరికీ మాత్రమే పాస్ లు లభించడంతో.. ఇద్దరే లోపలికి వెళ్ళినట్లు బయటపెట్టారు. వీరందరికి నాలుగేళ్లుగా ఒకరితో మరొకరికి పరిచయం ఉందని.. ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో చాట్ చేసినట్లు కూడా తేల్చారు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు ఉండగా.. మరోకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురు నిన్ననే ఢిల్లీకి చేరుకొని గురుగ్రామ్లోని లలిత్ ఝా అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండే ను దాడి జరిగిన తర్వాత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో నిందితుడు విక్కీ శర్మను, అతని భార్యని గుర్గావ్ లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లలిత్ కోసం గాలింపు జరుపుతున్నారు. నిందితుల కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నట్లు సమాచారం అందుతుంది.
సాగర్ శర్మ, మనోరంజన్ లోక్సభ గ్యాలరీకి వెళ్లారు. గ్యాలరీ నుంచి సభలోకి దూకిన సాగర్ శర్మ అలజడి సృష్టించగా.. గ్యాలరీలోనే స్మోక్ బాంబ్ పేల్చాడు మనోరంజన్. ఆగంతకులు స్మోక్ బాంబ్ ప్రయోగించారు. ఎంపీలు వారిని చుట్టుముట్టి పోలీసులకు పట్టించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలోనే వారు ‘నియంతృత్వం నశించాలి’, ‘భారత్ మాతాకీ జై’, ‘జై భీమ్, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కాగా పార్లమెంటు లోపల ఇదంతా జరుగుతున్న సమయంలోనే.. పార్లమెంటు వెలుపల నీలం, అన్మోల్.. స్మోక్ బాంబ్ లను ప్రయోగించి నిరసన తెలిపారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక నిందితుల్లో సాగర్ శర్మ, మనోరంజన్ కర్ణాటక నుంచి రాగా.. హర్యాణా నుంచి నీలమ్.. మహారాష్ట్ర నుంచి అన్మోల్ వచ్చినట్టు గుర్తించారు. నిందితుల వద్ద లభించిన విజిటింగ్ పాస్ లు.. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కార్యాలయం నుంచి లభ్యమైనట్టు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్ సహా ఎలాంటి గుర్తింపు కార్డులు లేనట్టు పోలీసులు గుర్తించారు. తమకు ఏ సంస్థతో సంబంధం లేదని.. తమంత తాముగా పార్లమెంట్ వద్దకు వచ్చామని నిందితులు చెబుతున్నారు. ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని…. హక్కుల కోసం గొంతెత్తితే జైలు పాలు చేస్తోంది అని చెప్పారు. ఇక అరెస్టైన నిందితులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు.
ఈ క్రమంలోనే పార్లమెంట్లో జరిగిన అలజడి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలికంగా విజిటర్స్ పాస్ల జారీని నిలిపివేయాలన్నారు. అంతేగాకుండా దాడికి గల కారణాలు, భద్రతా వైఫల్యానికి సంబంధించి లోతుగా దర్యాప్తు జరపాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇప్పటికే పార్లమెంట్ అలజడికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. దర్యాప్తును ఢిల్లీ సీపీ సంజయ్ అరోరా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సిఆర్పిఎఫ్ డీజీ అనిల్ దయాల్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.