Atishi Marlena Singh| దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసి.. పార్టీ తరపున కొత్త ముఖ్యమంత్రిగా కేబినెట్ మంత్రి ఆతిషి మార్లేనా సింగ్ పేరును ప్రస్తావించారు. మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్.. ప్రజల నుంచి నిజాయితీ సర్టిఫికేట్ పొందేందుకే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే ఢిల్లీ సిఎంగా ఆతిషి పేరు ప్రకటించగానే జాతీయ రాజకీయాల్లో అంతా ఆమె గురించే చర్చ మొదలైంది.
ఎవరీ ఆతిషి మార్లేనా?
ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతల్లో ఆతిషి సింగ్ ఒకరు. ఢిల్లీ విద్యా రంగంలో కీలక సంస్కర్ణలు తీసుకురావడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. ఆమె పూర్తి పేరు ఆతిషి మార్లేనా సింగ్. 1981, జూన్ 8 వ తేదీన ఆమె జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అయిన విజయ్ సింగ్, త్రిప్తా వాహి ఆమె తల్లిదండ్రులు. ఆతిషి తన స్కూలు, కాలేజీ విద్యను ఢిల్లీలోనే పూర్తి చేశారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి ఆమె హిస్టరీ లో డిగ్రీ పూర్తిచేశాక ఉన్నత చదువుల కోసం ఆమె లండన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చేరారు.
రాజకీయ ప్రయాణం
2013లో ఆతిషి ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరారు. పార్టీ కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తూ.. క్రమంగా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే కమిటీలో ఆమె సభ్యురాలిగా ఎదిగారు. ముఖ్యంగా ఢిల్లీ విద్యా సంస్కర్ణలు తీసుకురావడంతో ఆమె పాత్ర ప్రశంసనీయం. 2015లో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోదియాకు సలహాదారుగా ఆతిషి నియమించబడ్డారు. కానీ కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం 2018లో ఆమెను ఆ పదవి నుంచి తొలగించింది. అప్పటి నుంచి బిజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది.
Also Read: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి
ఆ తరువాత 2019లో ఆమె తూర్పు ఢిల్లీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో క్రికెటర్ గౌతమ్ గంభీర్ బిజేపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాల్ కాజీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. అప్పటి నుంచి ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో, ఢిల్లీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఎదిగారు. ఆమె కార్యశైలి చూసి 2020 గోవా ఎన్నికల్లో ఆప్ ఆమెను పార్టీ ఇంచార్జ్ గా నియమించింది. ఆ తరువాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మనీష్ సిసోదియా జైలులో ఉన్నప్పుడు ఆమె బిజేపీ, కేంద్ర ప్రభుత్వంపై అవసరమైనప్పుడల్లా విమర్శలు చేస్తూ.. పార్టీ బాధ్యతలను తన భుజాలపై మోసింది. ఫలితంగా ఆమెకు ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి లభించింది.
అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి పొందక ముందు ఆమె ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో రిషి వ్యాలీ స్కూల్ లో ఇంగ్లీష్, హిస్టరీ బోధించేవారు. ఆమె విద్యారంగంలో సంస్కర్ణలు తీసుకురావాలని ఎంతో కృషి చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుపరిచేందుకు, రైట్ లు ఎడుకేషన్ చట్టం కింద పాఠశాలల్లో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో ఏర్పాటు చేసేందుకు, ప్రైవేట్ స్కూల్స్ విపరీతంగా ఫీజులు పెంచకుండా ఆమె ఎంతో శ్రమించారు.