Assembly Bypoll Results 2024(Telugu news live today): ఏడు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. జూలై 10న మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 13 సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. మొత్తం 13 స్థానాల్లో 8 సీట్లపై ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండగా.. రెండు స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు లీడ్ చేస్తున్నారు.
పంజాబ్ జలంధర్ సీటుపై ఆమ్ ఆద్మీ పార్టీ మొహిందర్ భగత్ 30 వేల ఓట్లతో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్ లో దెహ్రా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి భార్య కమలేష్ ఠాకుర్.. బిజేపీ అభ్యర్థిపై 9000 ఓట్ల మెజారిటితో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ రాయ్ గంజ్ సీటును తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఈ సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన తొలి ఉపఎన్నికలు కావడంతో ఈ ఎలక్షన్స్ ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
ఎన్నికలు జరిగిన మొత్తం 13 సీట్లలో ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్ లో మూడు స్థానాలు, ఉత్తరాఖండ్ లో రెండు, బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఒక్కో అసెంబ్లీ సీటు కు ఉపఎన్నికలు నిర్వహించారు. ఈ 13 అసెంబ్లీ సీట్లలో గతంలో గెలిచిన ఎమ్మెల్యేలలో కొంతమంది చనిపోగా.. మరికొందరు తమ పదవికి రాజీనామా చేశారు.
బెంగాల్ లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టిఎంసీ).. పోటీ చేసిన నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ముందంజలో కొనసాగుతోంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసీ ఒక్క సీటుపై మాత్రమే విజయం సాధించింది. మిగతా మూడు సీట్లు బిజేపీ గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ తరువాత టిఎంసీలోకి జంప్ చేయడం మరో ట్విస్ట్.
హిమచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉపఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో దెహ్రా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకుర్ విజయం సాధించారు. నాలాగడ్ సీటుపై కూడా కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. హమీర్ పూర్ నుంచి బిజేపీ అభ్యర్థి ముందుంజలో ఉన్నారు.
ఉత్తరాఖండ్ లో మంగ్ లౌర్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరిగాయి. ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. ఇంతకుముందు ఈ సీటుపై బిఎస్పీ సిట్టింగ్ ఎమ్మెల్యే కరీమ్ అన్సారీ చనిపోవడంతో ఉపఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఉత్తరాఖండ్ లో మరో నియోజకవర్గం బద్రీనాథ్ నియోజకవర్గం నుంచి కూడా అధికార బిజేపీ వెనుకంజలో ఉంది.
బిహార్ లో ఒక్క అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బీమా భారతి తన పదవి రాజీనామా చేసి లోక్ సభ కోసం పోటీ చేయడంతో ఈ ఉపఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం కౌటింగ్ లో నితీశ్ కుమార్ జెడియు ముందంజలో ఉంది.
మధ్య ప్రదేశ్ లో అమర్ వాడా నియోజకవర్గం ఆదివాసీ రిజర్వడ్ సీటు. ఇక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కమలేష్ షా పదవికి రాజీనామా చేసి బిజేపీలో చేరారు. ఇప్పుడు బిజేపీ తరపున కమలేష్ షా బరిలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ఇన్వాతీ ముందంజలో ఉన్నారు.
తమిళనాడులో విక్రావండి నియోజకవర్గంలో డియంకె సిట్టింగ్ ఎమ్మెల్యే పుఘజెన్ధీ చనిపోవడంతో ఉపఎన్నిక జరిగింది. ప్రస్తుతం డియంకె, పియంకె, ఎన్ టికె పార్టీల మధ్య పోటీ నెలకొంది.