Assam Road Accident : అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా ప్రకటించారు.
గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ సమీపంలోని బలిజన్ గ్రామంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 45 మందితో విహారయాత్రకు వెళ్తున్న ఓ బస్సు బొగ్గు లారీని ఢీ కొట్టింది. రెండు వాహనాలు బలంగా ఢీ కొనడంతో వాహనాల మధ్య ప్రయాణికులు ఇరుక్కుపోయారు. దీంతో.. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణికులను జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అక్కడికక్కడే మృతి చెందిన 12 మంది ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు.